భారత్‌లో 2లక్షలు దాటిన కరోనా కేసులు..

By తోట‌ వంశీ కుమార్‌  Published on  3 Jun 2020 5:28 AM GMT
భారత్‌లో 2లక్షలు దాటిన కరోనా కేసులు..

భారత్‌లో కరోనా మహమ్మారి తీవ్ర రూపం దాల్చుతోంది. గడిచిన 24 గంటల్లో 8,909 కేసులు నమోదు కాగా.. 217 మంది మృత్యువాత పడ్డారని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తాజా బులిటెన్‌లో వెల్ల‌డించింది. దేశంలో కరోనా మహమ్మారి మొదలైనప్పటి నుంచి ఒక రోజు వ్యవధిలో అత్యధిక కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. వీటితో కలిపి భారత్‌లో కరోనా కేసుల సంఖ్య రెండు లక్షలు దాటింది.

ఇప్పటి వరకు దేశంలో 2,07,615 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 5,815 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం నమోదైన కేసుల్లో 1,00,303 మంది కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కాగా.. 1,01,497 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరోవైపు భారత్‌లో కరోనా మరణాలను తక్కువగా చూపుతున్నారనే వార్తలను ఆరోగ్య మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది. కరోనాతో పాటు ఇతర వ్యాధులతో మరణించిన వారి గణాంకాలను విశ్లేషించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదని, మృతుల సంఖ్యను తక్కువ చేసే అవకాశం లేదని స్పష్టం చేసింది. గత నాలుగు రోజులుగా దేశంలో 8 వేలకు పైగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అవుతున్నాయి.

దేశంలో మొదటి లక్ష కేసులు నమోదు కావడానికి రెండు నెలలు సమయం పట్టగా.. లక్ష నుంచి రెండు లక్షల కేసులకు చేరడానికి కేవలం 15 రోజులు మాత్రమే పట్టింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు అత్యధికంగా నమోదు అవుతున్న దేశాల్లో భారత్‌ 7వ స్థానంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక ప్రపంచ వ్యాప్తంగా 64 లక్షల మంది ఈ మహ్మమారి భారీన పడగా.. 3లక్షల 80 వేల మంది మృత్యువాత పడ్డారు.

Next Story