దాయాదిపై యువభారత్ జయకేతనం.. వరల్డ్ కప్కు అడుగుదూరంలో
By Newsmeter.Network Published on 4 Feb 2020 2:58 PM GMT![దాయాదిపై యువభారత్ జయకేతనం.. వరల్డ్ కప్కు అడుగుదూరంలో దాయాదిపై యువభారత్ జయకేతనం.. వరల్డ్ కప్కు అడుగుదూరంలో](https://telugu.newsmeter.in/wp-content/uploads/2020/02/Untitled-2-copy-11.jpg)
దాయాదాదుల సమరంలో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. అండర్-19 వరల్డ్ కప్ లో టీమిండియా యువ భారత్ అదరగొడుతోంది. సైమీఫైనల్ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ ను చిత్తుచేసిన టీమిండియా ఫైనల్ లోకి అడుగుపెట్టింది. పాక్ నిర్దేశించిన 173 పరుగుల విజయ లక్ష్యాన్ని సునాయాసంగా చేధించింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్, దివ్యాంశ్ సక్సేనాలు వీరవీహారంతో పది వికెట్ల తేడాతో విజయం సాధించుకుంది.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 43.1 ఓవర్లో 172 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లు ధాటికి పాకిస్థాన్ బ్యాట్స్ మెన్లు విలవిలలాడిపోయారు. నిప్పులు చెరిగే బంతులతో భయపెట్టారు. ముఖ్యంగా సుశాంత్ మిశ్రా 8.1 ఓవర్లు వేసి 28 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. కార్తీక్ త్యాగి, సుశాంత్ మిశ్రా, రవి బిష్ణోయ్లు ధాటికి పాక్ మరో 41 బంతులు మిగిలి ఉండగానే 172 పరుగులకు ఆలౌట్ అయింది. పాక్ ఆటగాళ్లలో ఎనిమిది మంది సింగిల్ డిజిట్ కూడా దాటలేకపోయారు. ఓపెనర్ హైదర్ అలీ (56), కెప్టెన్ రోహైల్ నజీర్ (62) అర్ధ సెంచరీలు చేయడంతో పాక్ ఆమాత్రం స్కోరైనా చేయగలిగింది. భారత్ బౌలర్లలో కార్తీక్ త్యాగి, రవి బిష్ణోయ్లు చెరో రెండు వికెట్లు తీసుకోగా, సుశాంత్ మిశ్రా 3 వికెట్లు తీశాడు. అథర్వ అంకోలేకర్, యశస్వి జైశ్వాల్ చెరో వికెట్ తీశారు.
173 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టిమిండియాకు భారత ఓపెనర్లు యశస్వి జైస్వాల్( 105 నాటౌట్; 113 బంతులు, 8 ఫోర్లు, 4సిక్సర్లు) సెంచరీతో కదం తొక్కగా, దివ్యాన్ష్ సక్సేనా (59నాటౌట్ ;99 బంతులు, 6 ఫోర్లు) అర్థ సెంచరీ రాణించడంతో టీమిండియా 35.2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా మ్యాచ్ను గెలిచింది.. భారత ఓపెనర్లను ఎలా కట్టడి చేయాలో అర్థంకాక పాక్ బౌలర్లు తలలు పట్టుకున్నారు. కాగా గురువారం న్యూజిలాండ్, బంగ్లాదేశ్ల మధ్య జరగనున్న రెండో సెమీస్ మ్యాచ్లో గెలిచిన జట్టుతో టీమిండియా తలపడనుంది. అండర్ 19 ప్రపంచకప్ ఫైనల్ పోరు ఫిబ్రవరి 9(ఆదివారం) ఇదే స్టేడియంలో జరగనుంది.