Hyderabad: ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం
ఔటర్ రింగ్ రైల్ని కలిగి ఉన్న భారతదేశపు మొదటి నగరంగా హైదరాబాద్ అవతరించనుంది.
By న్యూస్మీటర్ తెలుగు Published on 29 Jun 2023 12:39 PM IST
Hyderabad: ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం
హైదరాబాద్: ఔటర్ రింగ్ రైల్ (ORR)ని కలిగి ఉన్న భారతదేశపు మొదటి నగరంగా హైదరాబాద్ అవతరించనుంది. నగర శివార్లలోని రీజినల్ రింగ్ రోడ్ (RRR)కి సమాంతరంగా ఈ ప్రాజెక్టును నిర్మించనున్నారు. ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టును ఏర్పాటు చేసేందుకు తుది లొకేషన్ సర్వే చేపట్టేందుకు కేంద్రం రూ. 13.95 కోట్లను మంజూరు చేసిందని, రూ. 26 వేల కోట్లతో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నట్లు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి కిషన్రెడ్డి న్యూఢిల్లీలో మీడియాకు తెలిపారు.
563.5 కి.మీ ప్రాజెక్ట్లో 536 కి.మీ ఔటర్ రింగ్ రైల్తో పాటు అక్కన్నపేట, యాదాద్రి, చిట్యాల్, బూరుగాల, వికారాబాద్, గేట్ వనంపల్లి వద్ద బైపాస్-కమ్ రైల్-ఓవర్-రైలు ఉంటాయి. రూట్ మ్యాప్కు సంబంధించి దాదాపు 99 శాతం సన్నాహాలు పూర్తయ్యాయి. ఈ ప్రాజెక్టు కోసం భూసేకరణకు అయ్యే ఖర్చులో యాభై శాతం కేంద్రమే భరిస్తుంది. ప్రాజెక్టులో భాగంగా విజయవాడ, గుంటూరు, వరంగల్, నిజామాబాద్, మెదక్, ముంబై, వికారాబాద్ రైల్వే లైన్లను కలుపుతూ జంక్షన్లు ఏర్పాటు చేస్తారు.
ఈ మార్గాల్లో వెళ్లే వ్యక్తులు నగరంలోకి వెళ్లకుండా ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర నుంచి బయటకు వెళ్లి రోడ్డు లేదా రైలు మార్గంలో తమ తమ గమ్యస్థానాలకు వెళ్లవచ్చు. దీనివల్ల వ్యాపారంతో పాటు రవాణా రంగానికి కూడా గణనీయమైన లాభాలు వస్తాయని, హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల జిల్లాల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు. ఘట్కేసర్-రాయగిరి మధ్య ఎంఎంటీఎస్ రెండో దశ విస్తరణ పనులను కూడా కేంద్రం చేపడుతుందని కేంద్రమంత్రి తెలిపారు.
‘‘ఎనిమిదేళ్లు గడిచినా ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం విముఖత చూపుతున్నప్పటికీ, రూ.330 కోట్ల అంచనా వ్యయంతో ఎంఎంటీఎస్ రెండో దశ విస్తరణను వేగవంతం చేయాలని కేంద్ర రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ను ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశించారు. రైల్వే నిధులతోనే పూర్తిచేస్తాం’’ అని కేంద్ర మంత్రి అన్నారు.