గుండెకు రక్త ప్రసారం లేని స్థితిలో.. వ్యక్తి ప్రాణాలను కాపాడిన ఎస్ఎల్‌జి వైద్యులు

SLG doctors who saved the man's life.గుండెకు ర‌క్త స‌ర‌ఫ‌రా ఏ మాత్రం లేని వ్య‌క్తి ప్రాణాల‌ను కాపాడిన‌ట్లు ఎస్ఎల్‌జీ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 Oct 2022 11:59 AM GMT
గుండెకు రక్త ప్రసారం లేని స్థితిలో.. వ్యక్తి ప్రాణాలను కాపాడిన ఎస్ఎల్‌జి వైద్యులు

హైదరాబాద్ : గుండెకు ర‌క్త స‌ర‌ఫ‌రా ఏ మాత్రం లేని వ్య‌క్తి ప్రాణాల‌ను కాపాడిన‌ట్లు ఎస్ఎల్‌జీ వైద్యులు గురువారం ప్ర‌క‌టించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని భీమ‌వ‌రం ప‌ట్ట‌ణానికి చెందిన జి.శ్రీనివాస్(46) అనే వ్య‌క్తిని హైద‌రాబాద్‌లోని ఎస్ఎల్‌జి ఆస్ప‌త్రికి తీసుకువ‌చ్చారు. ఇక్క‌డ‌కు తీసుకువ‌చ్చే స‌మ‌యానికే అత‌డి ఆరోగ్యం విష‌మంగా ఉన్న‌ట్లు వైద్యులు తెలిపారు. అంత‌క‌ముందు అత‌డు చూపించుకున్న ఆస్ప‌త్రిలో సూప‌ర్ స్పెషాలిటీ స‌దుపాయం లేక‌పోవ‌డంతో అత‌డికి ఉన్న వాల్వ్ లీకేజీ స‌మ‌స్య‌ను గుర్తించ‌లేక‌పోవ‌డంతో అత‌డి ఆరోగ్య ప‌రిస్థితి విష‌మంగా మారింద‌న్నారు.

రోగి పరిస్థితి గురించి, అతడికి అందించిన చికిత్స గురించి ఎస్ఎల్‌జీ ఆస్పత్రి కార్డియోథొరాసిక్, వాస్క్యులర్ స‌ర్జన్ డాక్ట‌ర్ సుదీర్ మాట్లాడుతూ.. "మా ఆస్పత్రికి తీసుకు రాగానే రోగికి యాంజియోగ్రామ్, ఇతర ముఖ్యమైన పరీక్షలు చేయించాం. అతడి ఆరోగ్యపరిస్థితిని పూర్తిగా అంచనా వేసే లోపే రెండు సార్లు కార్డియాక్ అరెస్టు కావడంతో రెండు సార్లూ రీససిటేట్చేశాం. అతడి గుండెలో 8 సెంటీ మీటర్ల పొడవైన బ్లాక్ ఉన్నట్లు గుర్తించాం. ఇది బహుశా మనదేశంలోనే అత్యంతపెద్దబ్లాక్. దీని వల్లే గుండెకు రక్త సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ఆ పూడికను ముందుగా ఎండర్టెరెక్టమీ అనే ప్రక్రియ ద్వారా తొలగించి, ఆ తర్వాత అతడికి బైపాస్ స‌ర్జ‌రీ చేసి, మూడు రక్తనాళాల పూడికలకుబైపాస్చేశాం. దాంతో గుండెకు రక్త సరఫరా పునరుద్ధరణ జరిగింది"అని వివరించారు.

"సాధారణంగా గుండెకు రక్తాన్నిసరఫరా చేసే సామర్థ్యం ఎవరికైనా 60-65% ఉంటుంది. కానీ ఈ కేసులో అది 20% కు పడిపోయింది. బైపాస్ స‌ర్జ‌రీ చేసిన త‌ర్వాత రోగి గుండెకు రక్తసరఫరా మళ్లీమొదలైంది. అతడి గుండెకు రక్తాన్నిసరఫరా చేసే సామర్థ్యం 40%కుపెరిగింది. దాంతో అతడు సాధారణ పరిస్థితికి చేరుకున్నాడు. రోగి గుండె ఆరోగ్య పరిస్థితిని ఈరోజు పూర్తిగా మళ్లీ పరీక్షిస్తే, అతడు బాగున్నాడని తేలింది"అని ఎస్ఎల్‌జీ ఆస్పత్రి కార్డియాలజిస్టు డాక్టర్ఎం.భానుకిరణ్‌రెడ్డి తెలిపారు.

సీనియ‌ర్ క‌న్స‌ల్టెంట్‌, క్రిటిక‌ల్ కేర్ విభాగాధిప‌తి డాక్ట‌ర్ శ్రీనివాస్‌, కార్డియాక్ ఎనస్థీషియాలజిస్టు డాక్ట‌ర్ మాన‌స‌, సుశిక్షితులైన న‌ర్సింగ్ సిబ్బంది ఈ చికిత్స‌లో పాలుపంచుకున్న‌ట్లు తెలియ‌జేశారు.

శ్రీనివాస్ కేసులో అత్యంత సంక్లిష్టమైన శస్త్ర చికిత్సను ఎస్ఎల్‌జీ ఆస్ప‌త్రిలో ఆరోగ్య శ్రీ పథకం కింద పూర్తి ఉచితంగా నిర్వహించారు.

Next Story