హైదరాబాద్: బోయిన్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. మహేశ్, ఉమా దంపతులు, వారి ముగ్గురు పిల్లలతోపాటు సంధ్య అనే మరో కుటుంబ సభ్యురాలు అదృశ్యమైంది. అదృశ్యమైన కుటుంబ సభ్యులు న్యూ బోయిన్పల్లి ఏడుగుళ్ల సమీపంలో నివాసం ఉండే వారు. మిస్సింగ్ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మహేశ్ స్థానిక వాటర్ సప్లై స్టేషన్లో ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. గురువారం నాడు ఉదయం వీరి ఇంటికి సంధ్య వెళ్లింది.
ఆ తర్వాత మహేశ్, ఉమా, పిల్లలు రిషి, చైతు, శివన్, మరో కుటుంబ సభ్యురాలు సంధ్య ఒకేసారి ఇంటి బయటకు వెళ్లారు. మళ్లీ తిరిగిరాలేదు. దీంతో హౌస్ ఓనర్ ఉమా సోదరుడు భిక్షపతికి సమాచారం ఇచ్చాడు. అతను అదృశ్యమైన కుటుంబ సభ్యుల గురించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆ ఆరుగురు ఆటో బుక్ చేసుకొని బోయిన్పల్లి నుంచి ఎంజీబీఎస్ స్టేషన్కు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. అయితే అక్కడి నుంచి ఎటు వెళ్లారనేది తెలియాల్సి ఉంది. సీసీ కెమెరాల ఆధారంగా ఆరుగురి ఆచూకీ తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.