Hyderabad: 'ఎంఐఎం ఎమ్మెల్యేపై కేసు పెట్టండి'.. రాజాసింగ్ డిమాండ్
పాతబస్తీలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆపాలని మంత్రి కేటీఆర్ను గోషామహల్ ఎమ్మెల్యే టి రాజాసింగ్ డిమాండ్ చేశారు.
By అంజి Published on 14 March 2023 7:52 AM IST
Hyderabad: 'ఎంఐఎం ఎమ్మెల్యేపై కేసు పెట్టండి'.. రాజాసింగ్ డిమాండ్
హైదరాబాద్: పాతబస్తీలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆపాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ (ఎంఏ అండ్ యుడి) మంత్రి కేటీఆర్ను గోషామహల్ ఎమ్మెల్యే టి రాజాసింగ్ డిమాండ్ చేశారు. ఆ స్థానిక ప్రజలు ప్రభుత్వానికి విద్యుత్, నీటి బిల్లులు చెల్లించడం లేదని మండిపడ్డారు. 'న్యూ సిటీ' పన్ను చెల్లింపుదారుల సొమ్మును హైదరాబాద్ పాతబస్తీలో అభివృద్ధి కార్యక్రమాలకు ఎందుకు ఉపయోగించాలి? అంటూ ప్రశ్నించారు. ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) పార్టీ ఎమ్మెల్యేల ఆదేశాల మేరకు ప్రజలు విద్యుత్ బిల్లులు చెల్లించడం లేదని రాజాసింగ్ ఆరోపించారు.
ఆదివారం చాంద్రాయణగుట్టలోని అల్ జుబైల్ కాలనీలో తనిఖీకి వచ్చిన టీఎస్ఎస్పీడీసీఎల్ (తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్) అధికారులను ఏఐఎంఐఎం బహదూర్పురా ఎమ్మెల్యే మహ్మద్ మోజమ్ ఖాన్ బెదిరించిన ఘటనపై ఆయన స్పందించారు. పెండింగ్లో ఉన్న విద్యుత్ బకాయిలు తీసుకోవద్దని బహదూర్పురా ఎమ్మెల్యే విద్యుత్ శాఖ అధికారులను బెదిరిస్తున్నారని సస్పెండ్ చేయబడిన బీజేపీ నాయకుడు రాజాసింగ్ తన వీడియో ప్రకటనలో తెలిపారు. పాతబస్తీలో ఇలాంటి ఘటనలు ఎక్కువైయ్యాయని ఆయన ఆరోపించారు.
రాజా సింగ్ ఇంకా మాట్లాడుతూ.. ''నేను ఒక ప్రకటన చేస్తే, పోలీసులు వెంటనే స్పందించి, ఏదైనా లేదా ఇతర నేరానికి నాపై కేసు నమోదు చేస్తారు. ఎఐఎంఐఎం ఎమ్మెల్యే ఒక ప్రభుత్వ అధికారిని బెదిరించాడు. అతనిపై ఇంకా ఎటువంటి కేసు బుక్ చేయలేదు'' అని అన్నారు.