ఆదివారం వచ్చిందంటే చాలు.. ముక్క లేనిదే ముద్ద దిగదు చాలా మందికి. హైదరాబాద్లో అయితే.. మాంసం దుకాణాల ముందు నాన్ వెజ్ ప్రియులు క్యూ కడుతుంటారు. రోజు వారి కూలీ చేసుకునే వారైనా సరే ఎంతో కొంత చికెన్ గానీ మటన్ తీసుకెళ్లి కుటుంబంతో కలిసి హాయిగా ఆరగిస్తుంటారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. చికెన్ తింటే ఇమ్మూనిటీ పెరుగుతుందని డాక్టర్లతో పాటు అధికారులు చెప్పడంతో.. కొంత కాలంగా చికెన్ ధరలు కొండెక్కాయి.
ప్రస్తుతం మార్కెట్ లో కిలో స్కిన్లెస్ చికెన్ రూ.280 వరకు ఉండగా.. మటన్ ఐదొందల రూపాయలకు పైగానే ఉంది. అయినప్పటికి వీటిని తీసుకెలుతున్నారు. అయితే.. హైదరాబాద్ పరిధిలో నివసించే వారికి ఈ ఆదివారం ( ఏప్రిల్ 25 ) షాక్ తగలనుంది. ఎందుకంటే.. ఆ రోజు నాన్ వెజ్ దుకాణాలను మూసివేయాల్సిందిగా జీహెచ్ఎంసీ తెలిపింది. మహావీర్ జయంతి సందర్భంగా ఆదివారం గ్రేటర్ పరిధిలో కబేళాలు, మాంసం, బీఫ్ దుకాణాలు బంద్ చేయాలని జీహెచ్ఎంసీ ఒక ప్రకటనలో పేర్కొంది. నిబంధనలు అందరూ పాటించేలా చర్యలు తీసుకోవాలని వెటర్నరీ విభాగం అధికారులకు కమిషనర్ సూచించారు.