విషాదం.. బాత్‌రూంలో గీజర్‌ పేలి నవదంపతులు మృతి

Newly Wedded Couple Died After Geyser Exploded With Short Circuit In Hyderabad. హైదరాబాద్‌ నగరంలో విషాదం చోటు చేసుకుంది. బాత్రూంలో గీజర్‌ పేలి నవదంపతులు దుర్మరణం చెందారు.

By అంజి  Published on  21 Oct 2022 4:05 AM GMT
విషాదం.. బాత్‌రూంలో గీజర్‌ పేలి నవదంపతులు మృతి

హైదరాబాద్‌ నగరంలో విషాదం చోటు చేసుకుంది. బాత్రూంలో గీజర్‌ పేలి నవదంపతులు దుర్మరణం చెందారు. ఈ ఘటన లంగర్‌హౌస్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఖాదర్‌బాగ్‌లో జరిగింది. వైద్యులుగా పనిచేస్తున్న నవ దంపతులు తమ అపార్ట్‌మెంట్‌లోని బాత్‌రూమ్‌లో విద్యుదాఘాతానికి గురయ్యారు. మృతులు డాక్టర్ సయ్యద్ నిసారుద్దీన్‌గా గుర్తించారు. సూర్యాపేటలో ఔట్‌సోర్సింగ్ వైద్యుడిగా పనిచేస్తున్నారు. అతని భార్య ఉమ్మె మహ్మీన్ మెడికో, ఆమె ఎంబీబీఎస్‌ చివరి సంవత్సరం చదువుతోంది. వీరికి రెండు నెలల క్రితమే వివాహమయింది.

గురువారం రాత్రి 11.30 గంటలకు స్థానిక నాయకుడి నుంచి సమాచారం అందుకున్న నైట్‌ డ్యూటీ అధికారిణి ఎస్‌ శృతి, ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ పోలీస్‌ శ్రీనివాస్‌, అదనపు పోలీసు ఇన్‌స్పెక్టర్‌ ముజీబ్‌-ఉర్‌-రహమాన్‌ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా వివాహిత ఇద్దరి మృతదేహాలను గుర్తించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని ఉస్మానియా జనరల్‌ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. షార్ట్‌సర్క్యూట్‌ కారణంగానే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.

నైట్ డ్యూటీ ఆఫీసర్ సంబంధిత ఎస్‌ శృతి మాట్లాడుతూ.. నవ దంపతులు సూర్యాపేటకు వెళ్లి అక్టోబర్ 19న తిరిగి వారి నివాసానికి వచ్చారు. రాత్రి భోజనం చేసిన తర్వాత రెండో అంతస్తులో నిద్రకు ఉపక్రమించారు. అయితే మరుసటి రోజు ఉదయం తన తండ్రితో మాట్లాడిన భార్య మొహమీన్, తరువాత ఎటువంటి కాల్‌లకు స్పందించలేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు భార్యాభర్తలు స్పందించకపోవడంతో ఏదో అరిష్టం జరిగి ఉంటుందని భావించిన కుటుంబ సభ్యులు తలుపులు పగలగొట్టి చూడగా.. బాత్‌రూమ్‌లో విగతజీవులుగా పడి ఉన్నారు.

Next Story