మొయినాబాద్ డ్రగ్స్ కేసులో నిందితులకు న్యాయస్థానంలో చుక్కెదురు!

మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసులో నిందితులకు న్యాయస్థానంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది

By -  Knakam Karthik
Published on : 7 April 2026 9:24 PM IST

Hyderabad, Moinabad Drugs Case, PilotRohitReddy, TelanganaPolice, DrugRacket, Court Verdict, BailRejected

మొయినాబాద్ డ్రగ్స్ కేసులో నిందితులకు న్యాయస్థానంలో చుక్కెదురు!

మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసులో నిందితులకు న్యాయస్థానంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి మరియు నమిత్ శర్మలు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను రాజేంద్రనగర్ కోర్టు కొట్టివేసింది. విచారణ కీలక దశలో ఉన్న తరుణంలో బెయిల్ మంజూరు చేయడం సరికాదని భావించిన కోర్టు, వారి అభ్యర్థనను తిరస్కరించింది.

మరోవైపు, ఈ కేసులో లోతైన విచారణ కోసం నిందితులను మరికొన్ని రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరుతున్నారు. ఇప్పటికే రెండుసార్లు కస్టడీలో విచారించిన పోలీసులు, మరిన్ని ఆధారాల సేకరణ కోసం మూడోసారి పోలీస్ కస్టడీకి అనుమతించాలని ఉప్పరపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నిందితులను ఐదు రోజుల పాటు విచారించాల్సిన అవసరం ఉందని పోలీసులు తమ అభ్యర్థనలో పేర్కొన్నారు.

పోలీసులు దాఖలు చేసిన ఈ కస్టడీ పిటిషన్‌పై ఉప్పరపల్లి కోర్టు రేపు తన నిర్ణయాన్ని వెల్లడించనుంది. ఒకవైపు బెయిల్ నిరాకరణ, మరోవైపు పోలీసుల కస్టడీ పిటిషన్‌తో ఈ డ్రగ్స్ కేసు ప్రక్రియ ఇప్పుడు మరింత ఉత్కంఠగా మారింది. కోర్టు గనుక పోలీసుల విన్నపాన్ని మన్నిస్తే, ఈ కేసులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది.

Next Story