హైదరాబాద్ నగరంలోని చాంద్రాయణగుట్టలో జరిగిన ఓ రేవ్ పార్టీ ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. ఫిబ్రవరి 13న అర్థరాత్రి దాటిన తరువాత ఓ ఇంట్లో ఎంఐఎం కార్యకర్తలు రేవ్ పార్టీ నిర్వహించినట్లు పోలీసులకు సమాచారం అందింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకి సంబంధించిన వీడియోలు వైరల్గా మారాయి. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. చాంద్రాయణగుట్టలో ఓ ఇంట్లోకి ఇతర రాష్ట్రాల మహిళలను పిలిపించి ఆశ్లీల నృత్యాలు చేయించారట. అలాగే ఫుల్ గా మద్యం సేవించిన వారు మగువలతో చిందులు వేసిన వీడియోలు బయటకు వచ్చాయి. ఈ రేవ్ పార్టీకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
రేవ్ పార్టీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చాంద్రాయణగుట్ట పోలీసులు స్పందించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దీనికి సంబంధించి పర్వేజ్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారు. ఘటన జరిగిన సమయంలో వెంటనే దాడి చేస్తే వివరాలు తెలిసేవని ప్రస్తుతం కేవలం వీడియో మాత్రమే ఉన్నందున దానికి సంబంధించిన వివరాలు సేకరించాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు. అమ్మాయిలను ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? వాళ్లు ఇక్కడి వాళ్లేనా? లేక ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చారా? అనే కోణంలోనూ వివరాలు సేకరిస్తున్నారు.