హైదరాబాద్ మెహదీపట్నం రైతుబజార్, బస్టాప్ ప్రాంతంలో స్కైవాక్ నిర్మాణ పనుల దృష్ట్యా ట్రాఫిక్ పోలీసులు మళ్లింపులు ప్రకటించారు. వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా ఏప్రిల్ 10, 11 తేదీల మధ్య అర్ధరాత్రి 12 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయి. మాసబ్ ట్యాంక్, ఎన్ఎండిసి, ఎస్.డి కంటి ఆసుపత్రి వైపు నుండి రేతిబౌలి, నానల్ నగర్ వెళ్లే వాహనాలను అజీజియా మసీదు వద్ద గల పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్వే పిల్లర్ నంబర్ 2, 3 వద్ద మళ్లిస్తారు.
ఈ వాహనాలు మెరాజ్ కేఫ్ మీదుగా వెళ్లి, పిల్లర్ నంబర్ 15 వద్ద కుడి మలుపు తీసుకుని తిరిగి ప్రధాన మార్గంలోకి వెళ్లాల్సి ఉంటుంది. ప్రయాణికులు తాజా సమాచారం కోసం ట్రాఫిక్ పోలీసుల సోషల్ మీడియా ఖాతాలను అనుసరించాలని, అత్యవసర సమయాల్లో హెల్ప్లైన్ నంబర్ 9010203626ను సంప్రదించాలని అధికారులు సూచించారు.