Hyderabad: ట్రాఫిక్‌ పోలీసులపైకి దూసుకెళ్లిన లారీ.. ఒకరు మృతి

మియాపూర్ మెట్రో స్టేషన్‌లో సోమవారం అర్థరాత్రి విధుల్లో ఉన్న ముగ్గురు ట్రాఫిక్ కానిస్టేబుళ్లపైకి లారీ దూసుకెళ్లింది.

By అంజి
Published on : 8 April 2025 11:26 AM IST

Lorry crashes into traffic booth, Miyapur Metro, kills one, Crime

Hyderabad: ట్రాఫిక్‌ పోలీసులపైకి దూసుకెళ్లిన లారీ.. ఒకరు మృతి

హైదరాబాద్: మియాపూర్ మెట్రో స్టేషన్‌లో సోమవారం అర్థరాత్రి విధుల్లో ఉన్న ముగ్గురు ట్రాఫిక్ కానిస్టేబుళ్లపైకి లారీ దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒక హోంగార్డు మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మియాపూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నుండి ట్రాఫిక్ హోమ్ గార్డ్ సింహాచలం, కానిస్టేబుళ్లు రాజవర్ధన్, విజయేందర్ రాత్రి 11 గంటల ప్రాంతంలో మెట్రో స్టేషన్ లోని పిల్లర్ నంబర్ 600 దగ్గర విధుల్లో ఉన్నారు. వారు నో-ఎంట్రీ జోన్‌ను నిర్వహిస్తుండగా, భరత్ నగర్‌లో బియ్యం బస్తాలను దించిన లారీ కూకట్‌పల్లి రోడ్డు నుండి మియాపూర్ వైపు వేగంగా వచ్చి ట్రాఫిక్ బూత్‌ను ఢీకొట్టింది. బూత్‌లో విధుల్లో ఉన్న అధికారులపై కూలిపోయింది.

హోంగార్డు సింహాచలం తలకు తీవ్ర గాయమైంది, రాజవర్ధన్ కుడి చేయి, భుజం విరిగిపోయింది. విజయేందర్ కు స్వల్ప గాయాలయ్యాయి. ముగ్గురినీ మదీనాగూడలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సింహాచలం మరణించాడని మియాపూర్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. మిగిలిన ఇద్దరు ఇప్పటికీ చికిత్స పొందుతున్నారు.

లారీ డ్రైవర్ సదాశివపేటకు చెందిన శ్రీనివాస్‌గా గుర్తించారు. అతని నిర్లక్ష్యం, అతి వేగం కారణంగానే ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. మృతుడు సింహాచలం శ్రీకాకుళం జిల్లాలోని ఆమదాలవలసకు చెందినవాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు.

Next Story