Hyderabad: రక్తంతో వ్యాపారం.. రెండు బ్లడ్‌ బ్యాంక్‌ల లైసెన్స్‌లు రద్దు

మానవ ప్లాస్మాను అక్రమంగా విక్రయిస్తున్న హైదరాబాద్‌లోని రెండు బ్లడ్ బ్యాంకుల లైసెన్స్‌లను తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ రద్దు చేసింది.

By అంజి  Published on  20 Feb 2024 4:43 AM GMT
blood banks, Hyderabad,  plasma selling , Miyapur

Hyderabad: రక్తంతో వ్యాపారం.. రెండు బ్లడ్‌ బ్యాంక్‌ల లైసెన్స్‌లు రద్దు

హైదరాబాద్: మానవ ప్లాస్మాను అక్రమంగా విక్రయిస్తున్న హైదరాబాద్‌లోని రెండు బ్లడ్ బ్యాంకుల లైసెన్స్‌లను తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ రద్దు చేసింది. ఫిబ్రవరి 2న మూసాపేటలో అక్రమ ప్లాస్మా సేకరణ రాకెట్‌ను ఛేదించిన తర్వాత ఇది జరిగింది. మియాపూర్‌లోని మదీనాగూడలోని శ్రీకర హాస్పిటల్‌ బ్లడ్‌ సెంటర్‌, దార్‌ - ఉల్‌- షిపాలోని న్యూ లైఫ్‌ ఎడ్యుకేషనల్‌ సొసైటీ బ్లడ్‌ సెంటర్‌ లైసెన్స్‌లను రద్దు చేసినట్లు అధికారులు సోమవారం తెలిపారు.

విశ్వసనీయ సమాచారం మేరకు డిసిఎ అధికారులు ఫిబ్రవరి 2న మూసాపేటలోని నివాస భవనంలో ఉన్న హేమో సర్వీస్ లేబొరేటరీస్‌పై దాడులు నిర్వహించారు. ఫ్రీజర్‌లలో నిల్వ చేసిన మానవ ప్లాస్మా బ్యాగ్‌ల భారీ స్టాక్‌ను వారు గుర్తించారు. డీసీఏ ప్రకారం.. ఆర్‌. రాఘవేంద్ర నాయక్ అనే వ్యక్తి అపార్ట్‌మెంట్‌లో హేమో సర్వీస్ లాబొరేటరీస్ అనే సంస్థను నిర్వహిస్తున్నాడు, అక్రమంగా వివిధ బ్లడ్ బ్యాంక్‌ల నుండి ప్లాస్మాను సేకరించి, అనధికారిక పద్ధతిలో అమ్మకానికి నిల్వ ఉంచాడు.

శ్రీకర హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్, న్యూ లైఫ్ ఎడ్యుకేషనల్ సొసైటీ బ్లడ్ సెంటర్ నిబంధనలకు విరుద్ధంగా హేమో సర్వీస్ లేబొరేటరీస్‌కు చెందిన ఆర్. రాఘవేంద్ర నాయక్‌కు ప్లాస్మాను అక్రమంగా విక్రయించినట్లు డీసీఏ అధికారులు గుర్తించారు. డీసీఏ అధికారులు వెంటనే హైదరాబాద్‌లోని రెండు బ్లడ్ బ్యాంక్‌లపై దాడి చేసి, ధృవీకరణ తర్వాత హేమో సర్వీస్ ల్యాబొరేటరీలకు ప్లాస్మాను అక్రమంగా విక్రయించినట్లు నిర్ధారించారు. బ్లడ్ బ్యాంకుల వద్ద ప్లాస్మాఫెరిసిస్ అనే ప్రక్రియ ద్వారా.. ప్లాస్మా మొత్తం రక్తం నుండి వేరు చేయబడుతుంది.

ప్లాస్మా దాని స్థిరత్వాన్ని, క్షీణతను నివారించడానికి మైనస్ 30 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఫ్రీజర్‌లలో నిల్వ చేయాలి. బ్లడ్ బ్యాంక్ నుండి ప్లాస్మాను అక్రమంగా విక్రయించడం, బ్లడ్ బ్యాంక్ నిబంధనలకు అనుగుణంగా లేని కారణంగా DCA అధికారులు నివేదించిన కొన్ని ఉల్లంఘనలకు సంబంధించి DCA తెలంగాణ రెండు బ్లడ్ బ్యాంక్‌లకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. బ్లడ్ బ్యాంకుల ద్వారా ప్లాస్మా అక్రమ విక్రయాలు ప్రజారోగ్యంపై దుష్ప్రభావాలకు దారితీస్తాయని, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా రెండు బ్లడ్ బ్యాంకుల లైసెన్స్‌లను తక్షణమే రద్దు చేసినట్లు డిసిఎ డైరెక్టర్ జనరల్ కమలాసన్ రెడ్డి తెలిపారు.

బ్లడ్ బ్యాంక్‌లు ఇలాంటి కార్యకలాపాలను నిరోధించడానికి, బ్లడ్ బ్యాంకింగ్ పద్ధతుల సమగ్రతను నిర్ధారించడానికి కఠినమైన చర్యలను తప్పనిసరిగా అమలు చేయాలని ఆయన అన్నారు. అక్రమార్కులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Next Story