పోలీసులు థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారు..మహిళ సంచలన ఆరోపణలు

హైదరాబాద్‌లోని ఎల్‌బీనగర్‌ పోలీసులపై ఓ మహిళ సంచలన ఆరోపణలు చేస్తోంది.

By Srikanth Gundamalla  Published on  17 Aug 2023 9:02 AM GMT
LB Nagar, Police, Hyderabad, Third Degree, Women,

పోలీసులు థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారు..మహిళ సంచలన ఆరోపణలు

హైదరాబాద్‌లోని ఎల్‌బీనగర్‌ పోలీసులపై ఓ మహిళ సంచలన ఆరోపణలు చేస్తోంది. పంద్రాగస్టు అర్ధరాత్రి తనను పోలీసులు అదుపులోకుని రాత్రంతా పోలీస్‌స్టేషన్‌లో ఉంచారని.. అంతేకాకుండా తనపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగిచారని ఆరోపణలు చేస్తోంది. మహిళ ఆరోపణలు రాష్ట్రంలోనే సంచలనంగా మారాయి. పోలీసులపై పలువురు విమర్శలు చేస్తున్నారు. మహిళ బంధువులు, సామాజిక నాయకులు పలువురు పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని ఆందోళన చేశారు.

ఆడపిల్ల అర్ధరాత్రి ధైర్యంగా నడిచి ఇంటికి క్షేమంగా చేరుకున్నరోజే దేశానికి నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్లు అని మహాత్మాగాంధీ అన్నారు. అందుకే మహిళలను రాత్రి అరెస్టు చేయడం చట్ట వ్యతిరేకం. ఈ క్రమంలోనే అదే పంద్రాగస్టు అర్ధరాత్రి పోలీసులు తనని అరెస్ట్‌ చేశారని.. చిత్రహింసలు పెట్ఆరని మీర్‌పేట నందిహిల్స్‌కు చెందిన మహిళ ఆరోపణలు చేసింది. వరలక్ష్మి అనే మహిళ ఎల్బీనగర్‌ నుంచి సరూర్‌నగర్‌లోని బంధువుల ఇంటికి వెళ్లింది. తన కూతురు పెళ్లి కోసం వారి దగ్గర డబ్బులు విషయం మాట్లాడింది. ఆగస్టు 15న రాత్రి తిరిగి ఎల్బీనగర్‌ వస్తుండగా పోలీసులు ఎల్బీనగర్‌ సర్కిల్‌లో అడ్డుకున్నారు. ఆ తర్వాత ఆమెను పెట్రోలింగ్ వాహనంలో ఎక్కించుకుని.. పోలీస్‌ స్టేషన్‌కు తరలించారని బాధితురాలు చెబుతోంది. రాత్రంతా పోలీస్‌స్టేషన్‌లో ఉంచి థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారని మహిళ వాపోయింది. ఆ తర్వాత ఆగస్టు 16న ఉదయం ఇంటికి పంపిచారని తెలిపింది. ఇక చిత్రహింసలకు గురిచేస్తున్న సమయంలో ఎదురు తిరిగితే నీ సంగతి తెలుసు అంటూ ఇబ్బంది పెట్టారని వాపోయింది. పోలీసులు కొట్టడం వల్ల తగిలిన గాయాలను కూడా మహిళ చూపిస్తోంది. తనతో పాటు మరో ఇద్దరు మహిళలు కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సదురు బాధితురాలు తెలిపింది.

కాగా.. మహిళపై పోలీసులు దారుణంగా ప్రవర్తించారని.. ఆమె బంధువులు పోలీస్ స్టేషన్‌ వద్ద ఆందోళనకు దిగారు. పలువురు స్థానిక నాయకులు కూడా వారికి మద్దతు తెలిపారు. పోలీసులపై చర్యలు తీసుకోవాంటూ డిమాడ్ చేశారు. దాంతో.. ఎల్బీనగర్ పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. అయితే.. ఈ సంఘటనపై రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ డి.ఎస్‌. చౌహాన్‌ స్పందించారు. మహిళ ఆరోపణలపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయిస్తున్నట్లు తెలిపారు. కాగా.. ఆమె ఆరోపణలను ఎదుర్కొంటున్న హెడ్‌ కానిస్టేబుల్‌ శివశంకర్‌, మహిళా కానిస్టేబుల్‌ సుమలతపై సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు సీపీ డి.ఎస్. చౌహాన్.

Next Story