హైదరాబాద్: గుట్కా, పాన్ మసాలా, ఖైనీ, తంబాకు, మద్యం వంటి వ్యసన పదార్థాల వినియోగం వల్ల ముఖ్యంగా యువత ఆరోగ్యపరంగా తీవ్రమైన ప్రమాదాలకు గురవుతూ, తమ భవిష్యత్తును సంక్షోభంలోకి నెట్టుకుంటున్నారని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. దేశానికి యువతే శక్తి మూలాధారమని పేర్కొంటూ, అలాంటి యువశక్తి ఎటువంటి మత్తు పదార్థాలకు బానిస కాకుండా ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. యువతలో ఆరోగ్య చైతన్యం పెంపొందించడం అత్యవసరమని, ఇందుకు మారథాన్ల వంటి ప్రజా అవగాహన కార్యక్రమాలు సమర్థవంతమైన వేదికలని ఆయన తెలిపారు.
హైదరాబాద్లోని కాచిగూడలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ‘నోటి క్యాన్సర్ అవగాహన మారథాన్’కు సంబంధించిన వాల్ పోస్టర్ను మంత్రి జి. కిషన్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ మారథాన్ను హైదరాబాద్ స్మైల్స్ ఆధ్వర్యంలో, డా. కే. దిలీప్ కుమార్ నాయకత్వంలో నిర్వహిస్తున్నారు. హైటెక్ సిటీ లోని T-Works సమీపంలో 10 కిలోమీటర్ల మేర ఈ మారథాన్ నిర్వహించబడనుంది. నగరంలోని డెంటల్ మరియు ఇంజినీరింగ్ కళాశాలలకు చెందిన సుమారు 10 వేల మంది విద్యార్థులు ఇందులో పాల్గొననున్నారు.