హైదరాబాదీలకు కొత్త అనుభూతి.. రెడీ అవుతోన్న ఫ్లైట్‌ రెస్టారెంట్‌

Hyderabad set to get first airplane restaurant. వచ్చే ఏడాది ప్రారంభంలో హైదరాబాద్‌లో తొలి ఎయిర్‌ప్లేన్ రెస్టారెంట్ అందుబాటులోకి రానుంది.

By అంజి  Published on  26 Nov 2022 5:58 AM GMT
హైదరాబాదీలకు కొత్త అనుభూతి.. రెడీ అవుతోన్న ఫ్లైట్‌ రెస్టారెంట్‌

వచ్చే ఏడాది ప్రారంభంలో హైదరాబాద్‌లో తొలి ఎయిర్‌ప్లేన్ రెస్టారెంట్ అందుబాటులోకి రానుంది. ప్రముఖ హైదరాబాద్ రెస్టారెంట్‌ పిస్తా హౌస్ కేరళ వేలంలో పాత విమానాన్ని కొనుగోలు చేసి హైదరాబాద్‌కు రవాణా చేస్తోంది. విడిభాగాలుగా రవాణా అవుతున్న ఈ విమానాన్ని శామీర్‌పేటకు సమీపంలోనే మళ్లీ అసెంబుల్ చేయనున్నారు. అక్కడ ఇప్పటికే పిస్తాహౌస్‌ రెస్టారెంట్‌ను కలిగి ఉంది. సమీపంలోని ఖాళీ ప్లాట్‌ను ఎయిర్‌పోర్టులోని అనుభవాన్ని అందించే విధంగా స్థలాన్ని మార్చడానికి సిద్ధంగా ఉంది.

ప్లాన్ ప్రకారం.. వచ్చే కస్టమర్ల కోసం విమానం లోపల సీటింగ్ ఉంటుంది. వంటగది ఇప్పటికే ఉన్న రెస్టారెంట్‌లో ఉంటుంది. కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరిచేందుకు తుది మెరుగులు దిద్దడంతోపాటు, పిస్టా హౌస్ బృందం టెర్మినల్‌ను ఏర్పాటు చేసి బోర్డింగ్ టిక్కెట్లను అందజేస్తుంది. పిస్తా హౌస్ యజమాని అబ్దుల్ మజీద్ మాట్లాడుతూ.. దీనికి సంబంధించిన పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని, వచ్చే ఏడాది రిపబ్లిక్ డే నాటికి రెస్టారెంట్‌ను ప్రారంభించాలని యోచిస్తున్నామని చెప్పారు.

కేరళలోని కొచ్చిన్‌ నుంచి రోడ్డు మార్గంలో హైదరాబాద్‌కు విమానాన్ని తరలిస్తుండగా ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్లలో అండర్‌పాస్‌ వద్ద ఇరుక్కుపోయింది. అనంతరం మేదరమెట్ల పోలీసులు అండర్‌పాస్‌ నుంచి విమానాన్ని బయటకు తీయడానికి సహకరించారు. పవిత్ర రంజాన్ మాసంలో హలీమ్ కోసం పిస్తా హౌస్ ప్రసిద్ధి చెందింది. 1997లో రెస్టారెంట్ పరిశ్రమలో తమ వ్యాపారాన్ని ప్రారంభించారు. శాలిబండలో పిస్తాహౌస్‌ మొదటి హోటల్‌ను ప్రారంభించారు. ప్రస్తుతం నగరంలో వీరికి 32 బ్రాంచ్‌లు ఉన్నాయి.

ఇలాంటి విమాన నేపథ్య రెస్టారెంట్లు ఇప్పటికే భారతదేశంలో ఉన్నప్పటికీ, ఇది హైదరాబాద్‌లో మొదటిది కానుంది.

Next Story