ప్రజా భవన్ వద్ద ఆటోకు నిప్పు పెట్టుకున్న డ్రైవర్ (వీడియో)
హైదరాబాద్లోని ప్రజాభవన్ ముందు ఓ ఆటోలో మంటలు చెలరేగాయి.
By Srikanth Gundamalla Published on 1 Feb 2024 9:00 PM IST
ప్రజా భవన్ వద్ద ఆటోకు నిప్పు పెట్టుకున్న డ్రైవర్ (వీడియో)
హైదరాబాద్లోని ప్రజాభవన్ ముందు ఓ ఆటోలో మంటలు చెలరేగాయి. దాంతో..పోలీసులు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. ఇతర వాహనదారులు కూడా కంగారుపడ్డారు. అయితే.. ఆటో డ్రైవరే ఆటోకు నిప్పు పెట్టాడని పోలీసులు గ్రహించారు. అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించిన అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కాగా.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తోన్న విషయం తెలిసిందే. ఈ పథకం ద్వారా ఆటో డ్రైవర్లకు ఎంతో నష్టం వాటిల్లుతోందని.. గిరాకీ లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. ఆటో డ్రైవర్లు ఆందోళనలు కూడా చేస్తున్నారు. తమకూ ఒక దారి చూపించాలని.. ఆర్థిక సాయం అందించాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రజా భవన్ వద్ద ఆటో డ్రైవర్ స్వయంగా తానే తన ఆటోకు నిప్పు పెట్టిన సంఘటన కలకలం రేపుతోంది. సదురు ఆటో డ్రైవర్ మహబూబ్నగర్కు చెందిన దేవ్లా (45)గా పోలీసులు గుర్తించారు. జీవనోపాధి కోసం మైదరాబాద్కు వచ్చి మియాపూర్లో నివాసం ఉంటున్నాడు.
ఆటోకు ఎక్కువగా గిరాకీ రాకపోవడం.. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటుండటంతోనే దేవ్లా తన ఆటోకు నిప్పు పెట్టినట్లు తెలుస్తోంది. అయితే.. నిప్పు అంటించి అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించిన దేవ్లాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గురువారం సాయంత్రం ఈ సంఘటన జరిగింది. మంటల్లో ఆటో కాలిపోయింది. ఇక వాహనదారులకు ఇబ్బంది కలగకుండా పోలీసులు ట్రాఫిక్ను క్లియర్ చేశారు.
Hyderabad: ప్రజాభవన్ ముందు ఆటోలో మంటలు
— Newsmeter Telugu (@NewsmeterTelugu) February 1, 2024
ఆటోకు నిప్పంటించి వెళ్లిపోయేందుకు డ్రైవర్ యత్నం
ఆటో డ్రైవర్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు pic.twitter.com/9a93ULZHro