హైదరాబాద్: ''ఫిల్మ్ నగర్లోని దక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేత కేసులో దగ్గుబాటి సురేష్, వెంకటేష్, రానాపై నాంపల్లి కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నిసార్లు కోర్టు ఆర్డర్స్ ధిక్కరిస్తారని ప్రశ్నించింది. సెలబ్రిటీలకు ఒక న్యాయం, సామాన్యులకు ఒక న్యాయమా అని వ్యాఖ్యానించింది. ఎన్నిసార్లు తప్పించుకొని తిరుగుతారని మండిపడింది. ఫిబ్రవరి 5న కోర్టు ఎదుట వ్యక్తిగతంగా హాజరుకావాలని, లేదంటే నాన్బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తామంది'' అంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. దీనిపై సురేష్ ప్రొడక్షన్ లీగల్ టీమ్ క్లారిటీ ఇచ్చింది.
''జూబ్లీహిల్స్ డెక్కన్ కిచెన్ కేసు విషయంలో నాంపల్లి కోర్టులో దగ్గుబాటి కుటుంబానికి చుక్కెదురైందని. కోర్టు ఆర్డర్లను ధిక్కరించినందుకు జడ్జి సీరియస్ అయ్యారని..సెలబ్రిటీలకు ఒక న్యాయం, సామాన్యులకు ఒక న్యాయమా అంటూ కోర్టు వ్యాఖ్యానించినట్టు వస్తోన్న వార్తలు నిజం కాదు. వచ్చే నెల 5 న వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసినట్టు వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం. సహజంగానే కేసు 05/02/2026కి వాయిదా పడింది. ఇలాంటి తప్పుడు ప్రచారాలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి వాస్తవాలను ప్రచారం చేయవద్దని కోరుతున్నాము. తప్పుడు వివరాలు ప్రచురించితే చట్టపరమైన చర్యలు తీసుకునే పరిస్థితి వస్తుంది'' అని సురేష్ ప్రొడక్షన్ లీగల్ టీమ్ పేర్కొంది.