Hyderabad: మూసీ పరివాహకంలోని పేదలకు.. 16 వేల డబుల్ బెడ్రూమ్ ఇళ్ల మంజూరు!
మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు వల్ల నిర్వాసితులయ్యే కుటుంబాలకు 16 వేల డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంజూరు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ఎ. రేవంత్రెడ్డి మంగళవారం ప్రకటించారు.
By అంజి Published on 25 Sept 2024 7:11 AM IST
Hyderabad: మూసీ పరివాహకంలోని పేదలకు.. 16 వేల డబుల్ బెడ్రూమ్ ఇళ్ల మంజూరు!
హైదరాబాద్: మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు వల్ల నిర్వాసితులయ్యే కుటుంబాలకు 16 వేల డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంజూరు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ఎ. రేవంత్రెడ్డి మంగళవారం ప్రకటించారు. హైదరాబాద్లోని ఆక్రమణకు గురైన చెరువులు, కాలువల చుట్టూ నివాసం ఉంటున్న పేదలకు 2బీహెచ్కే ఫ్లాట్లు మంజూరు చేయడం లేదా ఇతరత్రా సహాయం అందించడం వంటి వాటిపై సమగ్ర సమాచారం సేకరించాలని అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్లో ఆక్రమిత చెరువులు, నాలాలతో పాటు మూసీ పరివాహక ప్రాంతాల పరిధిలో నివసించే అర్హులైన పేదల వివరాలను సేకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అర్హులైన పేదలు రోడ్డున పడే పరిస్థితి ఉండకూడదని, అలాంటి వారికి డబుల్ బెడ్రూమ్ లేదా ఇతర ప్రత్యామ్నాయం చూపించాలని చెప్పారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు, హైడ్రా చేపడుతున్న కార్యక్రమాలు, మెట్రో రైలు విస్తరణ వంటి అంశాలపై ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించిన ముఖ్యమంత్రి.. అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.
ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న చెరువుల పరిరక్షణ ఒక బాధ్యతగా చేపట్టాలని, చెరువులు, నాలాలు ఆక్రమణలకు గురికాకుండా పర్యవేక్షణను కట్టుదిట్టం చేయాలన్నారు. చెరువుల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ సెంటర్తో అనుసంధానం చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. ఓఆర్ఆర్ లోపల ఉన్న చెరువులు, కుంటలు, నాలాలు అన్నింటికీ ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను గుర్తించాలని, ఓఆర్ఆర్ లోపల ఉన్న ప్రతీ చెరువు, నాలాల ఆక్రమణల వివరాలతో పూర్తి స్థాయి నివేదికను తయారు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
ఎయిర్ పోర్టు నుంచి ఫ్యూచర్ సిటీకి మెట్రో మార్గానికి సంబంధించి పూర్తి స్థాయి నివేదికను రూపొందించాలని, ఓల్డ్ సిటీ మెట్రో విస్తరణ పనులను వేగంగా చేపట్టాలి. మెట్రో మార్గాలకు సంబంధించిన భూసేకరణ, ఇతర అడ్డంకులుంటే అధికారులు వాటిపై ప్రత్యేకంగా దృష్టి సారించి పరిష్కరించాలని, దసరాలోపు మెట్రో విస్తరణ రూట్పై పూర్తిస్థాయి డీపీఆర్ను సిద్ధం చేసి కేంద్రానికి సమర్పించాలని అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలిచ్చారు.