Hyderabad: శ్రీరామనవమి శోభాయాత్రలో గాడ్సే ఫోటో
హైదరాబాద్: నగరంలో శ్రీరామనవమి శోభాయాత్రలో స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహాత్మా గాంధీని చంపిన
By అంజి Published on 30 March 2023 8:15 PM IST
Hyderabad: శ్రీరామనవమి శోభాయాత్రలో గాడ్సే ఫోటో
హైదరాబాద్: నగరంలో శ్రీరామనవమి శోభాయాత్రలో స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహాత్మా గాంధీని చంపిన నాతూరాం గాడ్సే చిత్రపటం దర్శనమివ్వడం వివాదాస్పదమైంది. సస్పెండ్ అయిన గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ నిర్వహించిన శ్రీరామనవమి శోభాయాత్ర మంగళ్హాట్ మీదుగా వెళ్లినప్పుడు గాడ్సే చిత్రపటం కనిపించింది. రాజాసింగ్ తన అనుచరులతో కలసి మంగళ్హాట్ వద్ద శోభాయాత్రలో పాల్గొన్నపుడు ఆయన అనుచరులు గాడ్సే ఫోటోను ఊరేగింపులో ప్రదర్శించారు.
నగరంలోని శ్రీరామ నవమి శోభాయాత్ర గురువారం ఆసిఫ్ నగర్ సమీపంలోని సీతారాంబాగ్ ఆలయం వద్ద ప్రారంభమైంది. ఈ కార్యక్రమం మొదట్లో కొన్ని వందల మంది సభ్యులతో ప్రారంభమై, మంగళ్హాట్ పోలీస్ స్టేషన్ ప్రాంతం మీదుగా వెళ్లే కొద్దీ నెమ్మదిగా పెద్దదైంది. ఎమ్మెల్యే రాజా సింగ్ నేతృత్వంలో శ్రీరామ యువ సేన చేపట్టిన మరో ఊరేగింపు ప్రధాన ర్యాలీ మంగళ్హాట్ మీదుగా వెళ్లినప్పుడు గాడ్సే చిత్రపటం కనిపించింది. శ్రీరామనవమి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కళాకారులు, సాంస్కృతిక బృందాలు, మ్యూజికల్ బ్యాండ్లు కూడా మొదటి నుంచి ఊరేగింపులో పాల్గొన్నారు.
గత ఏడాది విద్వేషపూరిత ప్రసంగాలు చేసిన ఈవెంట్లో డీజేలు హిందుత్వ పాటలను ప్లే చేశారు. రాజకీయ బహిరంగ సభల్లో పాల్గొనకుండా తెలంగాణ హైకోర్టు నిషేధం విధించిన రాజా సింగ్ ఈ కార్యక్రమంలో చిన్నపాటి ప్రసంగం చేశారు.
''మన పెద్దలు కష్టపడి రామమందిరాన్ని సాకారం చేశారు. త్వరలో దీన్ని ప్రారంభించనున్నారు. మన దృష్టి ఇప్పుడు కాశీ, మధుర దేవాలయాలపైనే ఉంది, దాని కోసం మనం పోరాడాల్సిన అవసరం ఉంది. హిందువులు ఎవరికీ భయపడకూడదు. ఒక్క హిందువు 10,000 మందితో పోరాడగలడు. భయపడాల్సిన పని లేదు, మనం హిందూ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకోవాలి'' అని రాజా సింగ్ అన్నారు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో మంగళ్హాట్ పోలీస్స్టేషన్ రోడ్డులో ఊరేగింపు జరిగింది.