Hyderabad: దిల్‌సుఖ్‌నగర్‌ ఆర్టీసీ డిపోలో అగ్నిప్రమాదం

హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌ ఆర్టీసీ డిపోలో అగ్నిప్రమాదం సంభవించింది.

By Srikanth Gundamalla  Published on  22 Jan 2024 10:45 AM IST
hyderabad, dilsukh nagar, rtc depot, fire accident,

Hyderabad: దిల్‌సుఖ్‌నగర్‌ ఆర్టీసీ డిపోలో అగ్నిప్రమాదం

హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌ ఆర్టీసీ డిపోలో అగ్నిప్రమాదం సంభవించింది. సోమవారం తెల్లవారుజామునే ఈ సంఘటన చోటుచేసుకుంది. డిపోలో నిలిపి ఉంచిన ఓ సిటీ ఎక్స్‌ప్రెస్‌ బస్సులో ముందుగా ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. దాంతో.. దాని పక్కనే ఉన్న మరో బస్సుకు ఈ మంటలు అంటుకున్నాయి. క్రమంగా మంటలు ఎక్కువ అయ్యి రెండు బస్సులు పూర్తిగా కాలిపోయాయి. ఇక ఆర్టీసీ డిపో సిబ్బంది, స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలాని చేరుకున్నారు. మంటలను అదుపు చేశారు.

అయితే.. బస్సులో మంటలు ఎందుకు చెలరేగాయి అనేది తెలియలేదని అధికారులు చెప్పారు. ప్రమాదం జరిగిన సమయంలో చాలా బస్సులు డిపోలోనే ఉండటం వల్ల ఆందోళన నెలకొందని చెప్పారు. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది డిపోకు చేరుకోవడం.. మంటలు మరిన్ని బస్సులకు అంటుకోక ముందే ఆర్పేయడంతో పెనుప్రమాదం తప్పిందని అధికారులు అంటున్నారు. కాగా.. మొదట బస్సులో షార్ట్‌సర్క్యూట్‌ అవ్వడం వల్లే మంటలు చెలరేగి ఉండొచ్చని డిపో అధికారులు భావిస్తున్నారు. తెల్లవారు జామున పెద్ద ఎత్తున ఆర్టీసీ డిపోలో మంటలు అంటుకోవడంతో చుట్టుపక్కల ఉన్న స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ఇక ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేశామని.. దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సంఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని చెప్పారు.





Next Story