హైదరాబాద్లో గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ‘పిల్లల కిడ్నాప్ ముఠా’ వార్తలపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ఘాటుగా స్పందించారు. చాక్లెట్లతో పిల్లలను ఊరిస్తూ ఒక మహిళ కిడ్నాప్లకు పాల్పడుతోందంటూ వైరల్ అవుతున్న పోస్ట్ కేవలం పచ్చి అబద్ధమని ఆయన తేల్చిచెప్పారు. నగరంలో ఎక్కడా కిడ్నాప్ ముఠాలు లేవని, ప్రజలు అనవసరంగా భయాందోళన చెందవద్దని సిపి కోరారు.
ఫార్వర్డ్ మెసేజ్లను చూసి ఎవరినైనా అనుమానిస్తే వెంటనే డయల్ 100కి కాల్ చేయాలి కానీ, దాడులకు పాల్పడకూడదని హెచ్చరించారు. “ఆలోచించండి.. ధృవీకరించుకోండి.. బాధ్యతాయుతంగా వ్యవహరించండి” అంటూ ఆయన ‘X’ (ట్విట్టర్) వేదికగా పిలుపునిచ్చారు.
దేవుడి ముందు డ్రగ్స్ చూపిస్తారా? రీల్స్ రాయుళ్లకు వార్నింగ్!
మరోవైపు, మహాశివరాత్రి పర్వదినం వేళ ఆలయం ముందు డ్రగ్స్ చూపిస్తూ రీల్స్ తీసిన యువకులపై సిపి ఆగ్రహం వ్యక్తం చేశారు. “మహాశివరాత్రి అంటే మోక్షానికి అడుగు.. అటువంటి పవిత్ర స్థలంలో డ్రగ్స్ ప్రదర్శిస్తారా? ఫేమస్ అవ్వడం కోసం ఏమైనా చేస్తారా?” అని ప్రశ్నించారు. ఆలయం ముందు డ్రగ్స్ కల్చర్ని ప్రోత్సహించేలా రీల్స్ తీసిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. భక్తిని, చట్టాన్ని గౌరవించని వారి పట్ల పోలీసులు కఠినంగా ఉంటారని స్పష్టం చేశారు.