హైదరాబాద్: రాజేంద్రనగర్లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఉప్పర్ పల్లి వద్ద మారుతి కారు సర్వీస్ సెంటర్లో మంటలు చెలరేగాయి. మంటలకు తోడు నల్లటి పొగ దట్టంగా వ్యాపించింది. ఎగసి పడుతున్న మంటలను చూసి భయంతో పక్కనే ఉంటున్న అపార్ట్మెంట్ వాసులు బయటకు పరుగులు తీశారు.
స్థానికుల సమాచారంతో అగ్ని మాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. క్షణాల్లో మంటలు భారీగా వ్యాపించడంతో సర్వీస్కు ఇచ్చిన పలు కార్లు కాలి బూడిదయ్యాయి. సర్వీస్ సెంటర్ లో ఎవరు లేక పోవడంతో ప్రాణ నష్టం తప్పింది. అయితే భారీగా ఆస్తి నష్టం జరిగినట్టు తెలుస్తోంది. షాక్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరగినట్లుగా ప్రాథమిక సమాచారం.
అటు కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం దగ్గి పరిధిలోని 44వ నంబరు జాతీయ రహదారిపై హైదరాబాద్ వైపు వెళ్తున్న ఓ కంటెయినర్లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. దీంతో అటువైపు వెళ్లే ఇతర వాహనాలు ప్రమాదం బారిన పడకుండా ముందు జాగ్రత్తగా పోలీసులు, టోల్ప్లాజా అధికారులు వాహనాల రాకపోకలను నిలిపివేశారు.