రూ.450 నుంచి రూ.27 లక్షల వరకు: బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం ప్రయాణం ఇదే
10 రోజుల వినాయక చవితి ఉత్సవాలు మంగళవారంతో ముగియనున్న నేపథ్యంలో.. ఇప్పుడు అందరి దృష్టి హైదరాబాద్లోని బాలాపూర్ గణేష్ లడ్డూ వేలంపై పడింది.
By అంజి
రూ.450 నుంచి రూ.27 లక్షలకు: బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం ప్రయాణం ఇదే
హైదరాబాద్: 10 రోజుల వినాయక చవితి ఉత్సవాలు మంగళవారంతో ముగియనున్న నేపథ్యంలో.. ఇప్పుడు అందరి దృష్టి హైదరాబాద్లోని బాలాపూర్ గణేష్ లడ్డూ వేలంపై పడింది. గతేడాది ఈ లడ్డూను రూ.27 లక్షలకు వేలం వేయగా దాసరి దయానంద్ రెడ్డి కొనుగోలు చేశారు. బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం 1994 సంవత్సరం నుండి కొనసాగుతోంది. మొదటిసారి స్థానిక రైతు కొలన్ మోహన్ రెడ్డి 450 రూపాయలకు కొనుగోలు చేశారు.
ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఒకే కుటుంబం అనేక వేలంపాటల్లో పాల్గొంది. అనేక సందర్భాల్లో విజయవంతంగా గెలుపొందింది. వేలం ద్వారా వచ్చిన సొమ్మును గ్రామాల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు. 1994 నుండి 2024 వరకు హైదరాబాద్లోని బాలాపూర్ గణేష్ లడ్డూ వేలంలో.. లడ్డూ దక్కించుకున్న వారి జాబితా ఇక్కడ ఉంది.
| సంవత్సరం | వేలం విజేత | రూపాయలు |
| 1994 | కొలన్ మోహన్ రెడ్డి | రూ.450 |
| 1995 | కొలన్ మోహన్ రెడ్డి | రూ.4,500 |
| 1996 | కొలన్ కృష్ణా రెడ్డి | రూ.18,000 |
| 1997 | కొలన్ కృష్ణా రెడ్డి | రూ.28,000 |
| 1998 | కొలన్ మోహన్ రెడ్డి | రూ.51,000 |
| 1999 | కళ్లెం అంజి రెడ్డి | రూ.65,000 |
| 2000 | కళ్లెం ప్రతాప్ రెడ్డి | రూ.66,000 |
| 2001 | జి రఘునందన్ చారి | రూ.85,000 |
| 2002 | కందాడ మాధవ రెడ్డి | రూ.1,05,000 |
| 2003 | చిగిరింత బాల రెడ్డి | రూ.1,55,000 |
| 2004 | కొలన్ మోహన్ రెడ్డి | రూ.2,01,000 |
| 2005 | ఇబ్రామ్ శేఖర్ | రూ.2,08,000 |
| 2006 | చిగిరింత తిరుపతి రెడ్డి | రూ.3,00,000 |
| 2007 | జి రఘునందన్ చారి | రూ.4,15,000 |
| 2008 | కొలన్ మోహన్ రెడ్డి | రూ.5,07,000 |
| 2009 | సరిత | రూ.5,10,000 |
| 2010 | కొడాలి శ్రీధర్ బాబు | రూ.5,35,000 |
| 2011 | కోలన్ బ్రదర్స్ | రూ.5,45,000 |
| 2012 | పన్నాల గోవర్ధన్ రెడ్డి | రూ.7,50,000 |
| 2013 | తీగల కృష్ణా రెడ్డి | రూ.9,26,000 |
| 2014 | సింగి రెడ్డి జైహింద్ రెడ్డి | రూ.9,50,000 |
| 2015 | కళ్లెం మధన్ మోహన్ రెడ్డి | రూ.10,32,000 |
| 2016 | కందాడి స్కైలాబ్ రెడ్డి | రూ.14,65,000 |
| 2017 | నాగం తిరుపతి రెడ్డి | రూ.15,60,000 |
| 2018 | తేరేటిపల్లి శ్రీనివాస్ గుప్త | రూ.16,60,000 |
| 2019 | కొలన్ రామ్ రెడ్డి | రూ.17,60,000 |
| 2020 | అప్పటి సీఎంకు అందజేశారు | రూ.-- |
| 2021 | రమేష్ యాదవ్ & మర్రి శశాంక్ రెడ్డి | రూ.18,90,000 |
| 2022 | వంగేటి లక్ష్మా రెడ్డి | రూ.24,60,000 |
| 2023 | దాసరి దయానంద రెడ్డి | రూ.27,00,000 |
ట్రాఫిక్ సలహా
ఇదిలా ఉండగా, గణేష్ నిమజ్జన ఊరేగింపుకు సంబంధించిన మార్గాలను హైదరాబాద్ పోలీసులు ప్రకటించారు. సెప్టెంబర్ 17, మంగళవారం నాడు ఊరేగింపుల కోసం ట్రాఫిక్ అడ్వైజరీని జారీ చేశారు. ట్రాఫిక్ సజావుగా సాగేలా, ప్రజల భద్రతను కాపాడేందుకు ఉద్దేశించిన ఈ సలహా మంగళవారం ఉదయం నుండి బుధవారం మధ్యాహ్నం వరకు అమలులో ఉంటుంది. ప్రధాన ఊరేగింపు, చిన్న చిన్న ఊరేగింపులు, నిష్క్రమణ మార్గాలు, పార్కింగ్ ప్రాంతాలను వివరించే "రూట్ మ్యాప్"ని అనుసరించాలని పోలీసులు పౌరులను, భక్తులను అభ్యర్థించారు. ప్రజలకు సహాయం చేయడానికి వివిధ ప్రదేశాలలో సమాచార సూచికలు ప్రదర్శించబడతాయి.