ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు చేస్తే క్రిమినల్‌ కేసులు: సజ్జనార్‌

పోలీస్‌ అధికారులు, ఉపాధ్యాయులు, ఆర్టీసీ సిబ్బందితో సహా ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌...

By -  అంజి
Published on : 20 Nov 2025 12:03 PM IST

Criminal cases, attack, government employees, Hyderabad CP Sajjanar

ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు చేస్తే క్రిమినల్‌ కేసులు: సజ్జనార్‌

హైదరాబాద్‌: పోలీస్‌ అధికారులు, ఉపాధ్యాయులు, ఆర్టీసీ సిబ్బందితో సహా ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ హెచ్చరించారు. ఉద్యోగులను బెదిరించినా, దాడులు చేసినా చట్ట ప్రకారం బాధ్యులపై క్రిమినల్‌ కేసు నమోదు చేసి, హిస్టరీ షీట్స్‌ కూడా తెరుస్తామని వార్నింగ్‌ ఇచ్చారు. క్షణికావేశంలో ఏ చిన్న తప్పు చేసినా జీవితాంతం కుమిలి పోవాల్సి వస్తుందని ప్రకటన జారీ చేశారు.

''పోలీస్ అధికారులు, ఉపాధ్యాయులు, ఆర్టీసీ సిబ్బందితో సహా ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగించిన, బెదిరింపులకు దిగిన, దాడులు చేసిన చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులపై దాడులు చేస్తే భారత న్యాయ సంహిత(బీఎన్ఎస్)లోని 221, 132, 121(1) సెక్షన్స్ ప్ర‌కారం బాధ్యుల‌పై క్రిమినల్ కేసులను నమోదు చేస్తాం. హిస్టరీ షీట్స్ కూడా తెరుస్తాం. గుర్తుంచుకోండి.. ఒక్క‌సారి కేసు న‌మోదైతే భ‌విష్య‌త్ అంధ‌కార‌మ‌య్యే ప్రమాదం ఉంటుంది. పాస్ పోర్టు జారీకి, ప్ర‌భుత్వ ఉద్యోగానికి ఇబ్బందులు వ‌స్తాయి. క్ష‌ణికావేశంలో ఏ చిన్న‌త‌ప్పు చేసిన జీవితాంతం కుమిలిపోయేలా చేస్తాయి'' అని ఎక్స్‌ పోస్ట్‌లో పేర్కొన్నారు.

Next Story