చార్మినార్‌: టెన్షన్‌... టెన్షన్‌.. బండి సంజయ్‌ సవాల్‌.. అమ్మవారి ఆలయంలో పూజలు

Bandi Sanjay Challenge to CM KCR.. గ్రేటర్‌ రాజకీయం వేడెక్కింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా అధికార టీఆర్‌ఎస్‌

By సుభాష్  Published on  20 Nov 2020 7:22 AM GMT
చార్మినార్‌: టెన్షన్‌... టెన్షన్‌.. బండి సంజయ్‌ సవాల్‌..  అమ్మవారి ఆలయంలో పూజలు

గ్రేటర్‌ రాజకీయం వేడెక్కింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా అధికార టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది. వరదసాయంగా తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న పదివేల ఆర్థిక సాయం ఆపాలంటూ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ పేరు మీద ఎన్నికల సంఘానికి రాసిన లేఖ తీవ్ర వివాదం రేపుతోంది. వరద సాయం ఆగిపోవడానికి బీజేపీ నేతలే కారణమంటూ టీఆర్‌ఎస్‌ నేతలు విమర్శలకు దిగారు. ఆ లేఖతో తనకు ఎలాంటి సంబంధం లేదని సంజయ్‌ చెప్పుకొచ్చారు. తమను దొంగ దెబ్బ తీయడానికి సీఎం కేసీఆర్‌ ఆడిన నాటకంలో భాగమే ఈసీకి లేఖ అని ఎదురు దాడికి దిగారు. తన పేరు మీద సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడతున్న లేఖ తాను రాయలేదని సీసీఎల్‌లో బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. నకిలీ లేఖపై నిజాలు తేల్చుకుందామని సీఎం కేసీఆర్‌కు సంజయ్‌ సవాలు విసిరారు. చార్మినార్‌ భాగ్యలక్ష్మీ ఆలయం వద్దకు రావాలని సంజయ్‌ సవాల్ చేశారు. ఈ లేఖను తాను రాయలేదని అమ్మవారిపై ప్రమాణం చేస్తానని స్పష్టం చేశారు.

దీంతో కొద్ది సేపటి కిందట బండి సంజయ్‌ బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి చార్మినార్‌కు చేరుకున్నారు. శుక్రవారం బైక్‌ ర్యాలీకి కమల దళం సిద్దమై బయలుదేరింది. ర్యాలీగా అమ్మవారి ఆలయం వద్దకు చేరుకున్న సంజయ్‌ ప్రత్యేక పూజలు చేశారు. మరో వైపు సంజయ్‌ ర్యాలీకు ఎలాంటి అనుమతులు లేవని ముందుగా చెప్పిన పోలీసులు.. ఆ తర్వాత అనుమతిని ఇస్తున్నట్లు ప్రకటించారు. అయితే శుక్రవారం కావడంతో చార్మినార్‌ వీధుల్లో టెన్షన్‌ వాతావరణం నెలకొంది. ఇప్పటికే బీజేపీ కార్యాలయం ముందు భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. అలాగే సంజయ్ అమ్మవారి టెంపుల్‌ కు వస్తున్నాడని తెలిసి పోలీసు బలగాలు భారీగా మోహరించారు. ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా యాక్షన్‌ ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు. అయితే ఎన్నికల కోడ్‌ ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామని సీపీ అంజనీకుమార్‌ హెచ్చరించారు. సవాలు విసిరినట్లుగా బండి సంజయ్‌ భాగ్యలక్ష్మీ ఆలయంకు చేరుకోవడంతో చార్మినార్‌ ప్రాంతంలో టెన్షన్‌ వాతావరణం నెలకొంది.

Next Story