నాంపల్లిలో ఉద్రిక్తత..ఎంఐఎం ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత మధ్య వాగ్వాదం
హైదరాబాద్లోని ఓల్డ్ సిటీలో ఉద్రిక్త వాతావరణం కనిపించింది.
By Srikanth Gundamalla Published on 4 Jan 2024 9:30 PM IST
నాంపల్లిలో ఉద్రిక్తత..ఎంఐఎం ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత మధ్య వాగ్వాదం
హైదరాబాద్లోని ఓల్డ్ సిటీలో ఉద్రిక్త వాతావరణం కనిపించింది. కాంగ్రెస్ బలమైన ఉనికి నెలకొల్పడానికి ప్రయత్నాలు చేస్తోంది. దాంతో.. ఎంఐఎం ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్యారెంటీల అమలుపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే ఐదు గ్యారెంటీల కోసం ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తోంది. డిసెంబర్ 28 నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులతో పాటు.. ప్రజాప్రతినిధులు చురుగ్గా పాల్గొంటున్నారు. ప్రజల నుంచి గ్యారెంటీల అమలు కోసం దరఖాస్తులు తీసుకుంటున్నారు. రానున్న జీహెచ్ఎంసీ, లోక్సభ ఎన్నికల్లో ఎలాగైనా మెజార్టీ సీట్లు సాధించేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది.
నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ పార్టీ కార్యకర్తలతో కలిసి ప్రజాపాలన పథకంపై అవగాహన కల్పించేందుకు ఆ నాంపల్లిలో పర్యటించారు. అంతలోనే ఫిరోజ్ఖాన్ ఉన్న ప్రాంతానికి ఎంఐఎం ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్, ఆయన అనుచరులు వెళ్లారు. ఈ క్రమంలోనే ఇరు పార్టీల కార్యకర్తలు, నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. ఘర్షణ చోటుచేసుకుంది. ఇక అక్కడ పరిస్థితుల గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగప్రవేశం చేశారు. ఇరు పార్టీలకు చెందిన నాయకులను చెదరగొట్టారు. ఆ తర్వాత అక్కడ పోలీసులు మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు భద్రత ఏర్పాటు చేశారు. జీహెచ్ఎంసీ, లోక్సభ ఎన్నికలు ఉన్నందన రెండు పార్టీల మధ్య విభేదాలు నెలకొంటున్నాయని పలువురు చెబుతున్నారు.
AIMIM MLA from Nampally Majid Hussain and Congress leader Feroz Khan argue during the Praja Palana programme in Hyderabad on Thursday, Jan 4 pic.twitter.com/aO8jFdo34H
— The Siasat Daily (@TheSiasatDaily) January 4, 2024