టీవీ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసు మరో మలుపు తీసుకుంది. స్వేచ్ఛ కూతురు తన భర్తపై వేస్తున్న నిందలు చూసి తాను తట్టుకోలేకపోతున్నానని పూర్ణ చందర్ భార్య స్వప్న తెలిపారు. ఆమెను తన భర్త సొంత బిడ్డలా చూసుకునేవారని పేర్కొన్నారు. స్వేచ్ఛతో రిలేషన్ షిప్ విషయం తెలిసి తాను డిప్రెషన్లోకి వెళ్లానన్నారు. పూర్ణచందర్ చెడ్డవాడు కాదని, న్యాయస్థానాలపై తనకు నమ్మకం ఉందని పేర్కొంటూ వీడియో విడుదల చేశారు.
పూర్ణ చందర్ ద్వారానే స్వేచ్ఛ తనకు పరిచయమని, వారిద్దరి మధ్య సంబంధం మొదట తనకు తెలియదని స్వప్న అన్నారు. వారిద్దరి వ్యవహారం తెలిశాక పూర్ణను వదిలేశానని చెప్పారు. పూర్ణచందర్పై స్వేచ్ఛ కూతురు అరణ్య చేస్తున్న ఆరోపణలు అసత్యం అని వీడియోలో చెప్పుకొచ్చారు. అరణ్యను పూర్ణచందర్ సొంత కూతురిలా చూసుకున్నాడని చెప్పారు. స్వేచ్ఛ తనను మానసికంగా టార్చర్ చేసిందని, పూర్ణచందర్ను బ్లాక్మెయిల్ చేసిందని స్వప్న ఆరోపణలు చేశారు. తన పిల్లలను కూడా అమ్మా అని పిలవాలని బయపెట్టిందన్నారు. తన భర్త నిర్దోషి, అమాయకుడని స్వప్న తెలిపారు.
అంతకుముందు పూర్ణచందర్పై స్వేచ్ఛ కుమార్తె సంచలన ఆరోపణలు చేశారు. పూర్ణచందర్ తనతో అసభ్యంగా ప్రవర్తించేవాడని, చెప్పుకోరాని చోట బ్యాడ్ టచ్ చేసేవాడని, తన అమ్మను కూడా తీవ్రంగా హింసించేవాడని తెలిపింది. ఆయన వేధింపుల వల్లే తన అమ్మ ఆత్మహత్య చేసుకుందని చెప్పింది. పూర్ణ రాసిన లేఖలో అన్నీ అవాస్తవాలేనని, ప్రభుత్వం అతడిని కఠినంగా శిక్షించాలని స్వేచ్ఛ కుమార్తె డిమాండ్ చేసింది. కాగా పూర్ణచందర్పై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.