మందుబాబులకు హెచ్చ‌రిక‌.. తాగి బండి న‌డిపితే రూ.10 వేల జ‌రిమానా ఇంకా

A fine of Rs. 10,000 for drunk driving.మందుబాబుల‌కు పోలీసులు గ‌ట్టి హెచ్చ‌రిక‌లు జారీ చేశారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  31 Dec 2022 4:56 AM GMT
మందుబాబులకు హెచ్చ‌రిక‌.. తాగి బండి న‌డిపితే రూ.10 వేల జ‌రిమానా ఇంకా

మ‌రికొన్ని గంట‌ల్లో కొత్త సంవ‌త్స‌రం రానుంది. నూత‌న సంవ‌త్స‌రానికి స్వాగ‌తం ప‌లికేందుకు న‌గ‌ర వాసులు సిద్ధం అవుతున్నారు. నూత‌న సంవ‌త్స‌ర వేడుక‌ల దృష్ట్యా ట్రాఫిక్ ఆంక్ష‌లు విధించారు. ఎలాంటి ప్ర‌మాదాలు జ‌ర‌గ‌కుండా ప‌లు జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. నేటి అర్థ‌రాత్రి నుంచి బేగంపేట్‌, లంగ‌ర్ హాస్ త‌ప్ప మిగిలిన అన్ని ఫ్లై ఓవ‌ర్ల‌ను మూసి వేయ‌నున్నారు.

పాత సంవ‌త్స‌రానికి గుడ్ బై చెబుతూ కొత్త సంవ‌త్స‌రానికి వెల్‌క‌మ్ చెబుతూ వేడుక‌ల‌కు సిద్ధం అవుతున్న త‌రుణంలో మందుబాబుల‌కు పోలీసులు గ‌ట్టి హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికితే చ‌ట్ట ప్ర‌కారం చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌న్నారు. ర్యాష్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్ చేసినా కేసులు త‌ప్ప‌వ‌ని చెప్పారు. డిసెంబరు 31 రాత్రి నుంచి జనవరి 1 ఉదయం వరకూ అన్ని ప్రాంతాల్లో ఆంక్షలు విధిస్తున్నట్టు ప్ర‌క‌టించారు.

మ‌ద్యం తాగి వాహ‌నం న‌డుపుతూ దొరికితే తొలిసారి రూ.10,000 జ‌రిమానా, ఆరు నెల‌లు జైలు శిక్ష విధించ‌నున్న‌ట్లు చెప్పారు. రెండోసారి ప‌ట్టుబ‌డితే రూ.15,000 ఫైన్‌, 2 సంవ‌త్స‌రాల శిక్ష త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రించారు. అంతేకాదండోయ్‌.. ఇలా దొరికిన వారి డ్రైవింగ్ లైసెన్స్‌ను సీజ్ చేసి స‌స్పెన్ష‌న్‌కు ర‌వాణా శాఖ‌కు పంప‌నున్న‌ట్లు తెలిపారు. మొద‌టి సారి 3 నెలలు స‌స్పెన్ష‌న్‌, రెండో సారి అయితే పూర్తిగా లైసెన్స్‌ను ర‌ద్దు చేయ‌నున్న‌ట్లు సైబరాబాద్‌ ట్రాఫిక్‌ డీసీపీ టి.శ్రీనివాసరావు వెల్ల‌డించారు. వాహ‌న‌దారులు నిబంధ‌న‌లు పాటిస్తూ శిక్ష‌ల‌కు దూరంగా ఉండాల‌ని సూచించారు.

Next Story