Hyderabad: గర్బా ఈవెంట్లో మహిళపై వేధింపులు.. కేసులు నమోదు
బేగంపేటలో జరిగిన గర్బా ఈవెంట్లో ఓ మహిళపై వేధింపులకు పాల్పడిన ఓ వర్గానికి చెందిన యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
By అంజి Published on 19 Oct 2023 6:53 AM IST
Hyderabad: గర్బా ఈవెంట్లో మహిళపై వేధింపులు.. కేసులు నమోదు
హైదరాబాద్ : బేగంపేటలోని హాకీ గ్రౌండ్స్లో జరిగిన గర్బా ఈవెంట్లో ఓ మహిళపై వేధింపులకు పాల్పడిన ఓ వర్గానికి చెందిన యువకుడిపై బేగంపేట పోలీసులు కేసు నమోదు చేశారు. సోమవారం రాత్రి జరిగిన అదే కార్యక్రమంలో అలజడి సృష్టించిన బజరంగ్ దళ్ కార్యకర్తలపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. నిర్దిష్ట వర్గానికి చెందిన ఓ వ్యక్తి తన మనవరాలి వద్దకు వెళ్లాడని 69 ఏళ్ల వ్యక్తి ఆరోపించారు. ఆ వ్యక్తి తన మనవరాలి వద్దకు వచ్చి తనతో దాండియా ఆడమని అడిగాడని ఆరోపించారు. ఆమె నిరాకరించడంతో, అతను ఆమెను ఇబ్బంది పెట్టడం కొనసాగించాడు. ఆమె మొబైల్ నంబర్, సోషల్ మీడియా వివరాలను పంచుకోవాలని బలవంతం చేశాడు.
ఆమె చేయి పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడు. వెంటనే ఈవెంట్లో ఉన్న పోలీసులకు 69 ఏళ్ల వ్యక్తి ఫిర్యాదు చేశాడు. ఇంత జరిగినా నిర్వాహకులు పట్టించుకోలేదని, రాత్రి 11.30 గంటల నుంచి మళ్లీ బిగ్గరగా సంగీతాన్ని వినిపించారని ఆరోపించారు. మరోవైపు బేగంపేట దాండియా ఈవెంట్లోకి హిందువుల పేర్లతో ముస్లిం అబ్బాయిలు వచ్చారనే వార్త తెలుసుకున్న నటి కరాటే కళ్యాణి, హిందూ సంస్థలు హాకీ గ్రౌండ్స్కి వచ్చాయి. ఈ క్రమంలోనే హిందూ సంస్థలు ఈవెంట్ నిర్వాహకులతో వివాదం సృష్టించారు. దీంతో కరాటే కళ్యాణిపై బౌన్సర్లు చెయ్యేత్తారు. ఈ క్రమంలోనే బేగంపేట పీఎస్ వందలాదిమంది హిందూవాహిని కార్యకర్తలు ధర్నాకు దిగారు.
నిర్వాహకురాలు కవితా జైన్ మాట్లాడుతూ.. కార్యక్రమం జరుగుతుండగా, దాదాపు 40 మంది బజరంగ్ దళ్ సభ్యులు బౌన్సర్లను తోసుకుంటూ కార్యక్రమంలోకి ప్రవేశించారు. వారు తనతో అనుచితంగా ప్రవర్తించడమే కాకుండా విసుగును కూడా సృష్టించారు, ఫలితంగా కొంతమంది పాల్గొనేవారు గాయపడ్డారని, ఈ తతంగమంతా ఆవరణలోని సీసీటీవీల్లో రికార్డయింది అని అన్నారు. ఫిర్యాదుతో పాటు సీసీటీవీ ఫుటేజీలు, రచ్చ సృష్టించిన వారి చిత్రాలను కవిత సమర్పించారు. ఈ ఘటనలపై విచారణ ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.