హనుమాన్ జయంతి వేడుకల నేపథ్యంలో ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 24 గంటల పాటు మద్యం విక్రయాలపై నిషేధం విధిస్తూ కమిషనర్ జి. సుధీర్ బాబు ఉత్తర్వులు జారీ చేశారు. ఏప్రిల్ 2వ తేదీ ఉదయం 6 గంటల నుంచి ఏప్రిల్ 3వ తేదీ ఉదయం 6 గంటల వరకు అన్ని రకాల వైన్ షాపులు, కల్లు దుకాణాలు, బార్లు మరియు రెస్టారెంట్లు మూసి ఉంచాలని స్పష్టం చేశారు.
శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఎక్సైజ్ చట్టం ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. అయితే, స్టార్ హోటళ్లు మరియు రిజిస్టర్డ్ క్లబ్లకు మాత్రం ఈ నిబంధన నుండి మినహాయింపు ఉంటుంది. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.