అరుదైన గుర్తింపు: అగ్రస్థానంలో హైదరాబాద్
By సుభాష్ Published on 19 Jan 2020 4:12 AM GMT
తెలంగాణ రాజధాని హైదరాబాద్కు మరో అరుదైన గుర్తింపు లభించింది. అన్ని రంగాల్లో శరవేగంగా దూసుకుపోతున్న హైదరాబాద్ సిగలో మరో కలికితురాయి చేరింది. 2020 సంవత్సరానికి ప్రపంచంలోనే అత్యంత క్రియాశీల నగరాల జాబితాలో హైదరాబాద్కు చోటు లభించింది. ప్రముఖ ప్రాపర్టీ కన్సల్టింగ్ సేవల సంస్థ జేఎల్ఎల్ రూపొందించిన ఈ జాబితాలో భాగ్యనగరం మొదటిస్థానంలో నిలిచింది. ఈ జాబితాలో బెంగళూరు రెండోస్థానంలో ఉండగా, టాప్ 20 స్థానాల్లో ఏడు భారతీయ నగరాలు ఉన్నాయి. కాగా, జేఎల్ఎల్ సంస్థ 130 నగరాల రియల్ ఎస్టేట్ రంగంలో పేరుగాంచిన జేఎల్ఎల్ సంస్థ అధ్యయనం చేసింది.
ఇక ప్రపంచంలో పోటీ పడుతున్న నగరాల జాబితాను తెలంగాణ మంత్రి కేటీఆర్, జేఎల్ఎల్ సీఈవో రమేష్ నాయక్, బొంతు రామ్మోహన్లతో కలిసి శనివారం రాత్రి విడుదల చేశారు. 130 నగరాలతో పోటీ పడుతూ మూడేళ్లలో రెండు సార్లు భాగ్యనగరం అగ్రస్థానంలో నిలువడం ఎంతో సంతోషంగా ఉందని కేటీఆర్ చెప్పుకొచ్చారు.
20014లోతెలంగాణ రాష్ట్ర ఏర్పడినప్పుడు హైదరాబాద్ ఈ జాబితాలో లేదని, తమ సర్కార్ తీసుకున్న చర్యలతో 2015లో20వ స్థానంలో ఉండగా, 2016లో ఐదో స్థానం, 2017లో మూడో స్థానం, 2018లో మొదటి స్థానం, 2019లో రెండో స్థానం నిలువగా, 2020లో మరోసారి అగ్రస్థానంలో నిలిచిందన్నారు.
భారత్ నుంచి ఏడు నగరాలు..
ఈ జాబితాలో భారత్ నుంచి ఏడు నగరాలకు చోటు లభించింది. మొదటి స్థానంలో హైదరాబాద్, రెండో స్థానంలో బెంగళూరు, ఐదో స్థానంలో చెన్నై, ఆరో స్థానంలో ఢిల్లీ, 12వ స్థానంలో పుణే, 16వ స్థానంలో కోల్కతా, 20వ స్థానంలో ముంబాయి నగరాలున్నాయి.
ఇక చైనా నుంచి 10వ స్థానంలో షెన్జెన్, 11వ స్థానంలో చోంగ్వింగ్, 13వ స్థానంలో వుహాన్,15వ స్థానంలో హాంగ్ఘౌ, 17వ స్థానంలో షాంఘై ఐదు నగరాలు ఈ జాబితాలో వచ్చి చేరాయి. ఇక అమెరికా నుంచి 9వ స్థానంలో సిలికాన్ వ్యాలీ,19వ స్థానంలో ఆస్టిన్, 14వ స్థానంలో మధ్య ఆసియా నుంచి దుబాయ్, 18వ స్థానంలో రియాద్, 4వ స్థానంలో ఆఫ్రికా నుంచి నైరోబీ నగరాలున్నాయి.