ఇది బిర్యానీ కాదు.. ఉల్లి కోసం పానీపూరి బండి వద్ద గొడవ..!

By అంజి  Published on  1 Jan 2020 5:48 AM GMT
ఇది బిర్యానీ కాదు.. ఉల్లి కోసం పానీపూరి బండి వద్ద గొడవ..!

హైదరాబాద్: గత కొద్ది రోజులుగా ఉల్లి పాయలు సామాన్య ప్రజలు భయపెడుతున్నాయి. ఉల్లిపాయలను సామాన్యుడు కొనకుండా ధరలు కొండెక్కి కూర్చున్నాయి. ఉల్లిపాయల కోసం దేశ వ్యాప్తంగ దొంగతనాలు, గొడవలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా నగరంలోని పానీపూరి బండి వద్ద ఉల్లిపాయల కోసం గొడవ జరిగింది. ఎస్‌ఆర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఓ పానీపూరి బండి వద్ద ఈ ఘటన జరిగింది. రహమత్‌ నగర్‌కు చెందిన ఆటో డ్రైవర్‌ వీరన పానీపూరి తినడానికి బండి వద్దకు వచ్చాడు. పానిపూరి తింటూ ఉల్లిపాయలు వేయాలని నిర్వహకుడిని ప్రశ్నించాడు. దీంతో నిర్వహకుడు పవార్‌ మాట్లాడుతూ.. ఇది బిర్యాని కాదని, పానీ పూడి బండి అని బదులిచ్చాడు. బిర్యానీకి ఏమైనా ఆర్డర్‌ ఇచ్చావా అంటూ హేళనగా మాట్లాడాడు.

పానీపూరి తిన్న వీరన్న డబ్బులు ఇవ్వనని తేగెసి చెప్పాడు. ఉల్లి ధరలు పెరగడంతో వేయడం లేదని పవార్‌ వీరన్నతో అన్నాడు. పవార్‌ మాటలు పట్టించుకోకుండా వీరన్న అక్కడి నుండి వెళ్లాడు. ఈ క్రమంలో ఆగ్రహంతో ఊగిపోయిన పానీ పూరి నిర్వహకుడు పవార్‌ వీరన్నపై చేయిచేసుకున్నాడు. ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి ఘర్షణకు దారి తీసింది. దాడిలో పవార్‌కు గాయాలు అయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆటో డ్రైవర్‌ వీరన్నను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇటీవల పశ్చిమబెంగాల్‌లోని ఓ కూరగాయల దుకాణంలో కొందరు దుండగులు ఉల్లిపాయలు దొంగతనం చేశారు. అయితే ఆ దుండగులు నగదు జోలికి వెళ్ల కుండా ఉల్లిపాయలు మాత్రమే ఎత్తుకెళ్లారు. చోరీ అయిన ఉల్లిపాయల విలువ రూ.50 వేలు వరకు ఉంటుందని షాప్‌ నిర్వహకుడు అక్షయ్ తెలిపాడు. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదనే సామేత ఉంది. ఇప్పుడిదే సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. ఉల్లిని కోస్తుంటేనే క‌న్నీళ్లు వ‌స్తుంటే.. ఇప్పుడు కోయకుండానే కన్నీళ్లు పెట్టిస్తోంది. ధరలు అధికంగా పెరిగిపోవ‌డంతో పూట‌గ‌డ‌వ‌ని ప‌రిస్థితి నెల‌కొంది.

ఉల్లి నిత్య‌వ‌స‌ర స‌రుకుగా మారిపోవ‌డంతో పెరిగిన ధ‌ర‌తో సామాన్యుడి ఇబ్బంది అంతా, ఇంతా కాదు. ఉల్లిగడ్డకు అతిపెద్ద మార్కెటైన మహారాష్ట్రలోని లాసల్గావ్‌ మండీలో కిలో ఉల్లి 50 రూపాయలు దాకా పలుకుతోంది. అది వంటగదికి వచ్చేసరికి దాదాపు ఆ ధ‌ర పైకెళ్లిపోయింది. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ తదితర మార్కెట్లలో కిలో ఉల్లిపాయలు రూ.150 నుంచి 200 వ‌ర‌కు ప‌లుకుతున్నాయి. అస‌లు ఉల్లి ధ‌ర ఇంత పెర‌గ‌డానికి అస‌లైన కార‌ణాలేంటీ..? మ‌రి ఇంత ధ‌ర పెరుగుతుంటే ప్ర‌భుత్వాలు ఏం చేస్తున్నాయ‌నే ప్ర‌శ్న‌లు సామాన్యుల‌లో త‌లెత్తుతున్నాయి.

Next Story