హుజూర్ నగర్లో బీజేపీ అభ్యర్థి టీఆర్ఎస్కు 'హుజూర్' అన్నాడా..?!
By న్యూస్మీటర్ తెలుగు Published on 26 Oct 2019 7:21 AM GMTహుజూర్నగర్ ఫలితంపై పోస్టుమార్టం మొదలైంది. ఈ సమీక్షలో పలు ఆసక్తికర అంశాలు తెలుస్తున్నాయి. టీఆర్ఎస్ పక్కా ఎలక్షన్ మేనేజ్మెంట్తో ముందుకు వెళ్లింది. దీంతో పాటు కాంగ్రెస్ వైఫల్యాలు కలిసివచ్చాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో సైదిరెడ్డి చేసిన సాయం గుర్తుపెట్టుకున్న నేతలు..తిరిగి ఆయన సాయం చేసినట్లు తెలుస్తోంది.
మరోవైపు హుజూర్నగర్లో బీజేపీకి పదివేల నుంచి 15 వేల వరకు వస్తాయని ఆ పార్టీ నేతలు ఆశించారు. తీరా చూస్తే మూడు వేల ఓట్లు కూడా రాలేదు. వచ్చిన ఓట్లు కేవలం 2,621 .1.35 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. డిపాజిట్ కూడా రాలేదు. దీంతో బీజేపీ శ్రేణులు ఏమైంది అని ఆరా తీస్తే ఆసక్తికర కోణం బయటపడింది.
బీజేపీ అభ్యర్థి డాక్టర్ కోట రామారావు ఆ పార్టీ నాయకత్వాన్ని ముప్పుతిప్పలు పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వ వైద్యుడిగా పని చేసిన ఆయన రాజకీయాలపై ఆసక్తితో మూడు నెలల కిందట రాజీనామా చేశారు. బీజేపీలో చేరారు. తీరా ఎన్నికల సమయంలో ఆయన యూ టర్న్ తీసుకున్నారని ఇప్పుడు ప్రచారం జరుగుతోంది
బిజెపి టికెట్ కోసం రాజకీయ కుటుంబ నేపథ్యం ఉన్న శ్రీ కళా రెడ్డి కూడా పోటీ పడ్డారు. కాని.. బిసి సామాజిక వర్గానికి చెందిన కోట రామారావును ఎంపిక చేశారు. టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీ అభ్యర్థులు ముగ్గురూ అగ్రకులాలకు చెందిన వారే. దీంతో బీసీ కార్డు ఫలిస్తుందని పార్టీ పెద్దలు ఆశించారు.
బి-ఫాం తీసుకునే సమయంలో కూడా ఎన్నికల వ్యయాన్ని సొంతంగా భరిస్తానని చెప్పిన రామారావు ఆ తర్వాత స్వరం మార్చాడట. తన దగ్గర డబ్బేమీ లేదని పార్టీ సమకూరిస్తేనే ప్రచారం చేస్తానని తెగేసి చెప్పాడట. దీంతో పార్టీయే ప్రచార బాధ్యత తీసకుందట. కనీసం కార్యకర్తలను కూడా రామారావు కలవలేదట.అంతో ఇంతో రాష్ట్ర పార్టీ ఫోకస్ పెట్టడంతోనే ఇన్ని ఓట్లు వచ్చాయనేది కమలం నుంచి వినిపిస్తున్న గుసగుస.
మరోవైపు ..రామారావు బీజేపీ పెద్దలను బ్లాక్ మెయిల్ చేశారనే ప్రచారం నడుస్తోంది. నామినేషన్ల పరిశీలన పూర్తియినప్పటి నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డికి మద్దతుగా ప్రచారం చేస్తానని చెప్పారట. గులాబీ కండువా కప్పుకుని ప్రచారం చేస్తానని టీఆర్ఎస్ పెద్దలకు మేసేజ్ పంపాడట. అయితే అభ్యర్థిని కొన్న అపవాదు వస్తుందని ఆ పార్టీ పెద్దలు తిరస్కరించారట.
మొత్తానికి బీజేపీ పెద్దలు కనీసం పదివేలు ఓట్లు వస్తే చాలు అనుకున్నారు, కానీ తీరా చూస్తే రైతు ట్రాక్టర్ గుర్తు, రోడ్డు రోలర్ గుర్తుతో పోటీలో ఉన్నసపావట్ సుమన్ (2,693) కంటే తక్కువగా కేవలం 2,621 ఓట్లు మాత్రమే పడ్డాయి. రామరావు అడ్డం తిరగడం వల్లే ఇదంతా జరిగిందని ఇప్పుడు బీజేపీ పెద్దలు అనుకుంటున్నారట...!!!