కరోనా ఎఫెక్ట్..ఆ వాహనాల విక్రయాలు భారీగా తగ్గాయట!
By Newsmeter.Network Published on 2 April 2020 9:36 AM GMTప్రపంచాన్ని కరోనా మహమ్మారి గడగడలాడిస్తోంది. ఈ మహమ్మారితో ప్రపంచంలోని అన్ని దేశాలు కుదేలవుతున్నాయి. అగ్రరాజ్యం అమెరికా, చైనా, స్పెయిన్, బ్రిటన్ ఇలా అన్ని దేశాలు అతలాకుతలం అవుతున్నాయి. ఆయా దేశాల్లో ప్రజలను బయటకురానివ్వడం లేదు. దీంతో అన్ని సంస్థలు మూతపడ్డాయి. భారత్లోనూ కరోనా ప్రభావంతో కేంద్రం లాక్ డౌన్ విధించింది. దీంతో ప్రజలు ఇండ్లకే పరిమితమయ్యారు. మరోవైపు వైద్యరంగం మినహా అన్ని రంగాలు మూతపడ్డాయి. ఈ నేపథ్యంలో కరోనా ఎఫెక్ట్ దేశీయ కార్ల కంపెనీలపై తీవ్ర ప్రభావాన్నిచూపింది. మార్చి నెలలో దేశీయ వాహన విక్రయాలు భారీగా తగ్గాయి. మారుతీ సుజుకీ, హ్యుందాయ్, టయోటా ఇలా అన్ని కంపెనీలు అమ్మకాలు లేక కుదేలయ్యాయి. దేశవ్యాప్తంగా లాక్డౌన్ ఉండటంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి.
Also Read : దేశంలో తొలి క్వారంటైన్ బర్త్.. ఎక్కడంటే..?
దీనికితోడు బీఎస్ -4 వాహనాల రిజిస్ట్రేషన్లను నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో కొనుగోలు దారులు వాహనాల కొనుగోలులో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. దీంతో ఆశించిన స్థాయిలో వాహనాలు అమ్ముడుపోని పరిస్థితి గత నెలలో నెలకొంది. ఏప్రిల్లో సైతం కరోనా ప్రభావంతో లాక్ డౌన్ కొనసాగుతుండటంతో కార్ల విక్రయాలు భారీగా తగ్గే అవకాశాలు ఉన్నట్లు కంపెనీల సిబ్బంది పేర్కొంటున్నారు. కంపెనీల వారీగా విక్రయాల తగ్గుదల చూస్తే.. మారుతీ సుజుకీ గత ఏడాదికి ప్రస్తుతం ఏడాదికి మార్చి నెలలో 47శాతం విక్రయాలు జరగలేదు. అదేవిధంగా హ్యుందాయ్ 47.20శాతం, మహీంద్రా 80శాతం, టాటా మోటార్స్ 82.69 శాతం, టయోటా కిర్లోస్కర్ 41.2 శాతం, రాయల్ ఎన్ఫీల్డ్ 41శాతం, అశోక్ లేలాడ్ 90శాతం వీఈసీవీ 83శాతం, మహీంద్రా ట్రాక్టర్స్ 31శాతం, హీరో మోటోకార్స్ 42.4శాతం విక్రయాలు తగ్గాయి. ఏప్రిల్ మొత్తం కరోనా ప్రభావం ఉండటంతో ఏప్రిల్లోనూ దేశీయ కార్ల విక్రయాలు భారీగా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి కరోనా ప్రభావంతో దేశంలోని దాదాపు అన్ని రంగాలు నష్టాల బాటలోనే పయనిస్తున్నాయని చెప్పవచ్చు.