విద్యా సంస్థలకు సెలవులు పొడిగించిన ఏపీ సర్కార్!

By సుభాష్  Published on  22 April 2020 4:55 AM GMT
విద్యా సంస్థలకు సెలవులు పొడిగించిన ఏపీ సర్కార్!

ఏపీలో కరోనా వైరస్‌ కాలరాస్తోంది. కరోనా పాజిటివ్‌ కేసులు నెమ్మదిగా పెరుగుతున్నా.. మర్కజ్‌ ఉదాంతం తర్వాత ఒక్కసారిగా కేసుల సంఖ్య పెరిగిపోయాయి. లాక్‌డౌన్‌ కొనసాగుతున్నందున రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకూ మే 3 వరకూ సెలవులను పొడిగిస్తున్నట్లు ఏపీ సర్కార్‌ ప్రకటించింది. ఈ మేరకూ పాఠశాల విద్య కమిషనర్‌ వీరభద్రుడు ఉత్తర్వులు జారీ చేశారు. వాస్తవానికి 2019-20 విద్యాసంవత్సరం ఏప్రిల్‌ 23తో ముగియాల్సి ఉంది.

కరోనా వైరస్‌ విజృంభిస్తుండటంతో విద్యార్థులకు పరీక్షలు నిర్వహించకుండానే సెలవులను ప్రకటించింది. పైగా మరోసారి లాక్‌డౌన్ పొడిగించిన నేపథ్యంలో సెలవులను కూడా పొడిగించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. మే 3వ తేదీ తర్వాత పరిస్థితిని సమీక్షించి మళ్లీ సెలవులు పొడిగించాలా..? వద్దా.. అనే అంశంపై నిర్ణయిస్తామని విద్యాశాఖ అధికారులు తెలిపారు.

కాగా, ఏపీలో కరోనా వైరస్‌ రోజురోజుకు విజృంభిస్తుండటంతో ఇతర రంగాలపైనే కాకుండా విద్యార్థుల చదువులపై తీవ్ర ప్రభావం చూపింది. పదో తరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి. ఏనాడు కూడా ఇలా పరీక్షలు వాయిదా పడిన దాఖలాలు లేవని పలువురు అంటున్నారు.

Next Story