కరోనా కట్టడికి హిట్మ్యాన్ విరాళం.. ఎంతిచ్చాడంటే..?
By తోట వంశీ కుమార్ Published on 31 March 2020 8:10 AM GMTకరోనా మహమ్మారి రోజు రోజుకు విభృంభిస్తోంది. కరోనా బాధితుల సాయానికి చాలా మంది క్రీడాకారులు ముందుకు వస్తున్నారు. భారత క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రైనా, అజింక్య రహానే, సౌరవ్ గంగూలీ, సచిన్ టెండ్కూలర్లు విరాళాలు ప్రకటించగా.. తాజాగా హిట్మ్యాన్ రోహిత్ శర్మ కూడా ఆ జాబితాలో చేరిపోయాడు.
కష్టకాలంలో ఉన్న మన దేశానికి సేవ చేసే బాధ్యత అందరిపైనా ఉందని పేర్కొన్న హిట్మ్యాన్ రోహిత్శర్మ కోవిడ్-19 బాధితులను, పేదలను ఆదుకునేందుకు తన వంతుగా రూ.80 లక్షలు విరాళం ఇచ్చినట్టు ట్విట్టర్లో పేర్కొన్నాడు. పీఎం కేర్స్కు రూ.45 లక్షలు, మహారాష్ట్ర సీఎం రిలీఫ్ ఫండ్కు రూ.25 లక్షలు, ఫ్రీ ఇండియా స్వచ్ఛంద సంస్థకు, వెల్ఫేర్ ఆఫ్ స్ట్రే డాగ్స్కు రూ. 5 లక్షల చొప్పున రోహిత్ సాయం చేశారు. లాక్డౌన్లోకి వెళ్లిపోయిన భారత్ మళ్లీ మునుపటి స్థితికి చేరుకోవాలని ఆకాంక్షించారు.
క్రికెటర్లు సురేశ్ రైనా రూ. 52 లక్షలు, సచిన్ టెండూల్కర్ రూ. 50 లక్షలు, అజింక్య రహానె రూ. 10 లక్షలు
క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ రూ.50 లక్షల చొప్పున పీఎం సహాయనిధికి విరాళాలు ప్రకటించారు. ఇక భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి, అతని భార్య, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ.. పీఎం–కేర్స్ ఫండ్, మహారాష్ట్ర ముఖ్య మంత్రి సహాయనిధి కోసం తామిద్దరం నిధులు అందించనున్నట్లు ప్రకటించారు. అయితే తాము ఎంత మొత్తం విరాళంగా ఇస్తున్నది మాత్రం వారిద్దరు గోప్యంగా ఉంచారు. అయితే విశ్వసనీయ సమాచారం మేరకు రూ.3కోట్లు ఇచ్చినట్లు సమాచారం.
భారత మహిళా క్రికెటర్లు కూడా ముందుకు వస్తున్నారు. ఇప్పటికే వన్డే జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ రూ. 10 లక్షలు విరాళం ఇవ్వగా.. స్పిన్నర్ పూనమ్ యాదవ్ రూ. 2 లక్షలు, దీప్తి శర్మ రూ. 1.5 లక్షలు విరాళంగా ఇచ్చారు.