కరోనా పై పోరుకు సానియా సాయం..
By తోట వంశీ కుమార్ Published on 31 March 2020 7:10 AM GMTకరోనా వైరస్(కొవిడ్-19) ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ మహమ్మారి ధాటికి వేల సంఖ్యలో మృత్యువాత పడగా.. లక్షల్లో దీని బాధితులు ఉన్నారు. కరోనా బాధితులను ఆదుకునేందుకు భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ముందుకు వచ్చింది. ఓ బృందంగా ఏర్పడి రూ.1.25కోట్ల విరాళాలు సేకరించినట్లు ఆమె తెలిపారు. గత వారం రోజులుగా అవసరమైన వారికి సాయం చేస్తున్నామని, తద్వారా వేల కుటుంబాలకు భోజన సౌకర్యం కల్పించినట్లు ట్విట్టర్లో వెల్లడించారు. తాము సేకరించిన రూ.1.25కోట్లు సుమారు లక్షల మందికి ఉపయోగపడుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. యూత్ఫీడ్ ఇండియా, సఫా ఇండియా స్వచ్చంధ సంస్థల ఆధ్వర్యంలో ఇప్పుడు విరాళాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. సానియా ఇంత పెద్ద మొత్తంలో విరాళం ప్రకటించడంతో ఆమెపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
కరోనా పై పోరులో ఎంతో మంది క్రీడాకారులు విరాళాలు ఇస్తున్నారు. పీఎంకేర్స్ ఫండ్కు టీమ్ఇండియా క్రికెటర్ సురేష్రైనా రూ.31లక్షలు అందివ్వగా.. ఉత్తరప్రదేశ్ సీఎం సహాయనిధికి రూ.21లక్షలు అందించాడు. భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ ప్రధాన మంత్రి సహాయనిధితో పాటు మహారాష్ట్ర సీఎం సహాయనిధికి రూ. 25లక్షల చొప్పున ఇచ్చాడు. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలి రూ.50లక్షలు, అజింక్యా రహానే రూ.10లక్షలను విరాళంగా అందజేశారు.