తెలంగాణ ప్ర‌భుత్వంపై హైకోర్టు సీరియ‌స్

By Medi Samrat  Published on  20 July 2020 10:42 AM GMT
తెలంగాణ ప్ర‌భుత్వంపై హైకోర్టు సీరియ‌స్

తెలంగాణలో క‌రోనా ప‌రిస్థితుల‌పై హైకోర్టు.. ప్ర‌భుత్వంపై సీరియ‌స్ అయ్యింది. ప్రజలను ప్రభుత్వం గాలికి వదిలేసిందని ఘాటు వ్యాఖ్యలు చేసింది. కరోనా పరిస్థితులపై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. కరోనా పరీక్షలు, సమాచారం వెల్లడి తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు ఆదేశాలు ఉల్లంఘించిన అధికారులపై చర్యలు ఎందుకు తీసుకోకూడదని కోర్టు ప్రశ్నించింది.

అధికారులపై కేసు పెట్టి, సస్పెండ్ చేయాలని ఎందుకు ఆదేశించకూడదో చెప్పాలని ఏజీని ప్రశ్నించింది. పదే పదే ఆదేశిస్తున్నా ఒక్కటి కూడా అమలు కావడం లేదని ధర్మాసనం తీవ్ర అసంతృప్తి తెలిపింది. ఢిల్లీ, ఏపీ రాష్ట్రాలతో పోలిస్తే కరోనా పరీక్షల్లో రాష్ట్రం చాలా వెనకబడి ఉందని కోర్టు పేర్కొంది. ఓవైపు కేసులు పెరుగుతుంటే ప్రభుత్వం నిద్రపోతోందంటూ న్యాయస్థానం ఘాటు వ్యాఖ్యలు చేసింది.

హెల్త్‌ బులెటిన్లలో ఇప్పటికీ సమగ్ర వివరాలు ఇవ్వడం లేదని.. ఆసుపత్రుల వారీగా బెడ్లు, వెంటిలేటర్ల వివరాలు ఇవ్వడం లేదని కోర్టు నిలదీసింది. అధికారులు ఉద్దేశపూర్వకంగా వాస్తవాలను దాచిపెట్టి కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సమాచారం తెలుసుకోవడం ప్రజల ప్రాథమిక హక్కు అని.. ఓ వైపు మొట్టికాయలు వేస్తుంటే అభినందించినట్లు ప్రజలను ఎలా తప్పుదోవ పట్టిస్తారని ప్ర‌శ్నించింది.

Next Story