ఆ కాలేజీలపై చర్యలకు హైకోర్టు ఆదేశం.. 29,808 మంది విద్యార్థులకు నష్టం..

By అంజి  Published on  27 Feb 2020 10:10 AM GMT
ఆ కాలేజీలపై చర్యలకు హైకోర్టు ఆదేశం.. 29,808 మంది విద్యార్థులకు నష్టం..

ముఖ్యాంశాలు

  • గుర్తింపులేని నారాయణ, శ్రీచైతన్య కాలేజీలపై హైకోర్టులో విచారణ
  • హైకోర్టుకు నివేదిక సమర్పించిన ఇంటర్‌ బోర్డు
  • గుర్తింపులేని కాలేజీల్లో 29,808 మంది విద్యార్థులు

హైదరాబాద్‌: రాష్ట్రంలోని గుర్తింపులేని నారాయణ, శ్రీచైతన్య కాలేజీలపై హైకోర్టులో విచారణ జరిగింది. సామాజిక కార్యకర్త రాజేష్‌.. గుర్తింపు లేని కాలేజీలపై చర్యలు తీసుకోవాలంటూ హైకోర్టులో ప్రజా ప్రయోజన పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. విచారణ నేపథ్యంలో హైకోర్టుకు ఇంటర్‌బోర్డు నివేదిక సమర్పించింది. అగ్ని మాపక శాఖ ఎన్‌ఓసీ లేని కాలేజీలకు షోకాజ్‌ నోటీసులు ఇచ్చామని ఇంటర్‌ బోర్డు కోర్టు తెలిపింది.

మార్చి 4 నుంచి పరీక్షలు ఉన్నందున కాలేజీలు మూసివేస్తే విద్యార్థులకు తీరని నష్టం జరుగుతుందని తెలిపింది. కాలేజీలు మూసివేయడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటారని పేర్కొంది. గుర్తింపు లేని కాలేజీల్లో 29,808 మంది ఉన్నారు. అగ్నిమాపక ఎన్‌ఓసీ లేని కాలేజీల్లోనూ పరీక్ష కేంద్రాలున్నాయి. కాగా పరీక్షలు ముగిశాక కాలేజీలు మూసివేసేందుకు అనుమతి ఇవ్వాలని హైకోర్టును ఇంటర్‌ బోర్డు కోరింది. చర్యలు తీసుకొని ఏప్రిల్‌ 3న నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Next Story