ఏపీలో భారీ వర్షాలు
By సుభాష్ Published on 9 Jun 2020 9:38 AM ISTజూన్ 1న కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. కర్ణాటక, ఏపీ దాటుతూ తెలంగాణ వైపు పయనిస్తున్నాయి. రుతుపవనాల కారణంగా ఇప్పటికే బెంగాల్, తమిళనాడు తదితర ప్రాంతాల్లో రుతుపవనాలు విస్తరించడంతో వర్షాలు కురిశాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా అక్కడక్కడ భారీగా వర్షాలు కురిశాయి. ఇక బుధవారం నాటికి మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా రుతుపవనాలు విస్తరించి ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఇక తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో మంగళవారం రాష్ట్రంలోని కొన్ని చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. బుధవారం నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశిస్తుండటంతో చాలా చోట్ల తొలకరి వర్షాలు కురియనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, 47-56 సెంటీమీటర్ల వర్ష పాతం నమోదు అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. అలాగే మత్స్యకారులు సైతం చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. కృష్ణా, గుంటూరు, మరి కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.