క్యాన్సర్, గుండె జబ్బులతోనే ప్రపంచంలో ఎక్కువ మంది ప్రాణాలు కోల్పొతున్నారు. అందుకే వీటిని ప్రాణాంతక వ్యాధులుగా చెబుతారు. అయితే ఇలాంటి వ్యాధుల బారిన పడి మరణిస్తున్న వారిలో మహిళల కంటే పురుషుల సంఖ్యే ఎక్కువగా ఉందని తాజాగా లాన్సెట్ జర్నల్ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. కరోనా వల్ల ప్రాణం కోల్పోయిన వారిలో కూడా పురుషుల సంఖ్యే ఎక్కువగా ఉన్నట్టు పేర్కొంది.
పురుషుల్లో మధుమేహం, అధిక ఆల్కహాల్ వినియోగం వల్ల కాలేయ సమస్యలు, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటున్నట్టు గుర్తించింది. మద్యపానం, ధూమపానం అలవాటు ఎక్కువగా ఉన్నవారిలో లివర్ సిరోసిస్, ఊపిరితిత్తులు, నోటి క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్ వంటి వ్యాధుల ముప్పు పెరిగి పురుషుల ప్రాణాలు తీస్తున్నట్టు లాన్సెట్ పేర్కొంది. కాబట్టి పురుషులు ధూమపానం, మద్యపానంకు దూరంగా ఉండాలని, ఒత్తిడిని తగ్గించుకోవాలని సూచించింది. అటు స్త్రీలలో ప్రధానంగా తలనొప్పి, డిప్రెషన్, పొట్ట నొప్పి, ఆందోళన, అల్జీమర్స్, హెచ్ఐవి వంటివి వ్యాధులు ఎక్కువగా వస్తున్నట్టు పేర్కొంది. అయితే డిప్రెషన్ వల్ల పురుషుల కంటే స్త్రీలే ఎక్కువగా నష్టపోతున్నట్టు పరిశోధకులు తెలిపారు.