రాణించిన రోహిత్శర్మ.. కివీస్ టార్గెట్ ఎంతంటే..
By Newsmeter.Network Published on 29 Jan 2020 9:04 AM GMT
హామిల్టన్ వేదికగా సెడాన్ పార్క్ లో కివీస్ తో జరుగుతున్న మూడో టీ20లో హిట్ మ్యాన్ బ్యాట్ ఝళిపించాడు. మొదటి రెండు టీ20ల్లో తేలిపోయిన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ (65: 40 బంతుల్లో 6x4, 3x6) మూడో టీ20లో రెచ్చిపోయి ఆడాడు. దీంతో నిర్ణీత 20ఓవర్లో టీమిండియా 5 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. ఐదు టీ20ల ఈ సిరీస్లో తొలి రెండు మ్యాచ్ల్లో టీమిండియా చేజింగ్ చేసి మ్యాచ్ లను గెలుపొందింది.
టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్ కేఎల్ రాహుల్ (27: 19 బంతుల్లో 2x4, 1x6)తో కలిసి భారత్ ఇన్నింగ్స్ని ప్రారంభించిన రోహిత్ శర్మ ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు. ఎడాపెడా బౌండరీలు బాదేశాడు. వరుసగా రెండు మ్యాచుల్లో రెండు అర్థశతకాలు బాదిన రాహుల్ ఆచితూచి ఆడినా.. రోహిత్ మాత్రం టాప్గేర్లో దూసుకెళ్లాడు. ఈ క్రమంలో 23 బంతుల్లోనే 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు. హాఫ్ సెంచరీ బాదిన రోహిత్ శర్మ 11వ ఓవర్లో ఔటవగా.. ఆ తర్వాత స్కోరు బోర్డు కాస్త నెమ్మదించింది.
రోహిత్ శర్మ ఔట్ తర్వాత క్రీజులోకి వచ్చిన శివమ్ దూబే (3) తేలిపోగా.. కెప్టెన్ విరాట్ కోహ్లీ (38: 27 బంతుల్లో 2x4, 1x6), శ్రేయాస్ అయ్యర్ (17: 16 బంతుల్లో 1x6) దూకుడుగా ఆడలేకపోయారు. చివరి ఓవర్లో మనీశ్ పాండే (14 నాటౌట్: 6 బంతుల్లో 1x4, 1x6), రవీంద్ర జడేజా (10 నాటౌట్: 5 బంతుల్లో 1x6) చెరొక సిక్స్ బాది 18 పరుగులు రాబట్టడంతో భారత్ జట్టు 179 పరుగుల మెరుగైన స్కోరు చేయగలిగింది. కివీస్ బౌలర్లలో బెన్నెట్ మూడు వికెట్లు తీసుకోగా, గ్రాండ్హోమ్, సాట్నర్ చెరో వికెట్ తీసుకున్నారు.