వధువును చూస్తూ.. ఫోన్కి తాళి కట్టేశాడు
By తోట వంశీ కుమార్ Published on 29 April 2020 7:48 AM GMTకరోనా మహమ్మారి వ్యాప్తిని నిరోధించడానికి దేశవ్యాప్త లాక్డౌన్ ను విధించారు. లాక్డౌన్ కారణంగా చాలా మంది తమ వివాహాలను వాయిదా వేసుకున్నారు. ఇక అమ్మాయి, అబ్బాయి ఒకే ఊరిలో ఉంటే.. ఎలాగోలా సామాజిక దూరం పాటిస్తూ పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. మరీ ఇద్దరు వేరు వేరు రాష్ట్రాలలో ఉంటే..? ప్రస్తుత పరిస్థితుల్లో పెళ్లి అసాధ్యం.అయితే.. కొందరు మాత్రం ఇలాంటి ముహూర్తం మళ్లీ రాదంటూ.. దూరం తమ శరీరాలకే తప్ప మనసుకు కాదంటూ.. తమకు తోచిన విధంగా పెళ్లిచేసుకుంటున్నారు.
ముఖ్యంగా తమిళనాడులో అన్ లైన్ వివాహాలు చేసుకుంటున్నారు. అబ్బాయి ఎక్కడో.. అమ్మాయి మరెక్కడో ఉండి పెళ్లి ఖర్చు లేకుండా పెళ్లి చేసుకుంటున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. వదువుకు తాళి కట్టేది ఎలా..? అన్న ప్రశ్నకు ఓ వరుడు వినూత్నంగా ఆలోచించాడు. సెల్ఫోన్కు తాళి కట్టగా.. అక్కడ అమ్మాయి తనకు తాను మూడు ముళ్లు వేసుకుంది.
కేరళ రాష్ట్రం కొట్టాయం జిల్లాకు చెందిన శ్రీజిత్ నాదేశన్(30) కు అదే ప్రాంతానికి చెందిన అంజన(28) తో పెళ్లి నిశ్చయమైంది. జనవరిలో వీరి పెళ్లి జరగాల్సి ఉండగా.. కొన్ని కారణాల వల్ల పెళ్లి ఏప్రిల్ 26కు వాయిదా పడింది. అంజన ఉత్తరప్రదేశ్ లఖ్నవూలోని ఓ ఐటి కంపెనీలో పనిచేస్తోంది. లాక్డౌన్ కారణంగా రవాణా వ్యవస్త నిలిచిపోవడంతో.. ఆమె అక్కడే ఉండిపోయింది. మరో మారు పెళ్లి వాయిదా వేయడానికి ఇరుకుటుంబాల వాళ్లు ఇష్టపడలేదు. దీంతో వీరు టెక్నాలజీని ఉపయోగించుకుని పెళ్లి చేసుకున్నారు. ఈ నెల 26న ఈ జంట వీడియో కాల్ యాప్ను వినియోగించుకుని ఒక్కటైంది. పెళ్లి వస్త్రాలు ధరించి ఇద్దరు వీడియో కాల్లో సెల్ఫోన్ల ముందు కూర్చుకున్నారు. సరిగ్గా మూహూర్తం సమయానికి వరుడు.. ఎదురుగా ఉన్న వధువును ఆన్లైన్లో చూస్తూ.. ఫోన్కు తాళి కట్టాడు. అక్కడ వధువు కూడా తనకు తానే తాళి కట్టుకుంది. దీంతొ పెళ్లి తంతు ముగిసి పొయింది. ఇరు పక్షాల బంధువులు శుభాక్షాంక్షలు చెప్పకున్నారు. లాక్డౌన్ను ముగిసిన అనంతరం తమ రిసెప్షన్ను గ్రాండ్ గా ఏర్పాటు చేస్తామని నూతన వధూవరులు చెబుతున్నారు.
కాగా.. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సెల్ ఫొన్ కు తాళి కట్టడడం ఎంటా అని అందరు ముక్కున వేసుకోగా.. భలే ఐడియా బాస్ అంటూ మరి కొందరు పెళ్లి కొడుకు ఐడియాను మెచ్చుకుంటున్నారు.