ఇక టెన్త్ పరీక్షలు లేకుండానే ఇంటర్కు.. పంజాబ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం
By సుభాష్ Published on 9 May 2020 4:35 AM GMTదేశంలో కరోనా మహమ్మారి ప్రభావం అన్ని రంగాలపై పడింది. కరోనా కట్టడికి దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. దీంతో విద్యాసంస్థలన్నీ మూతపడ్డాయి. విద్యార్థుల పరీక్షలు సైతం వాయిదా పడ్డాయి. ఇప్పటికే కొన్ని ప్రభుత్వాలు 1 నుంచి 9వ తరగతి విద్యార్థుల పరీక్షలు రద్దు చేసి పై తరగతులకు ప్రమోట్ చేశాయి. అయితే వాయిదా పడ్డ పదో తరగతి పరీక్షుల ఎప్పుడు నిర్వహిస్తారనేది విద్యార్థుల్లో నెలకొన్న టెన్షన్. ఏపీ, తెలంగాణలో త్వరలో పరీక్షలు నిర్వహిస్తామని ఇరు రాష్ట్రాలు ప్రకటించాయి.
ఈ నేపథ్యంలో పంజాబ్ రాష్ట్రం సంచలన నిర్ణయం తీసుకుంది. 5వ తేగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఎలాంటి పరీక్షలు లేకుండానే పై తరగతులకు ప్రమోట్ చేస్తున్నట్లు పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ప్రీ-బోర్డు పరీక్షా ఫలితాల ఆధారంగా టెన్త్ విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేస్తామని పంజాబ్ స్కూట్ ఎడ్యుకేషన్ బోర్డు ప్రకటించింది. కాగా, ఇంటర్ పరీక్షల విషయంలో మాత్రం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిర్ణయాన్ని పాటిస్తామని పంజాబ్ ముఖ్యమంత్రి తెలిపారు.
లాక్డౌన్ కారణంగా ఇప్పటి విద్యార్థుల చదువులకు ఎంతో ఆటంకం ఏర్పడింది. కొన్ని రాష్ట్రాల్లో ఆన్లైన్ ద్వారా టెన్త్ విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు. దురదర్శన్ వంటి ఛానళ్ల ద్వారా పదో తరగతి విద్యార్థులకు రోజులో రెండు గంటల చొప్పున పాఠాలు బోధిస్తున్నారు.