మ్యాచ్ జరుగుతుంది.. వేదికను మార్చే ప్రసక్తే లేదు.!
By Medi Samrat Published on 1 Nov 2019 7:19 AM GMTబంగ్లాదేశ్ తో టీమిండియా మూడు టీ20ల సిరీస్లో భాగంగా తొలి టీ20 ఆదివారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్పై సందిగ్ధత నెలకొంది. ఢిల్లీలో ప్రస్తుతం నెలకొన్న వాయు కాలుష్య పరిస్థితుల కారణంగా ఈ మ్యాచ్ నిర్వహణపై పలు అనుమానాలు వస్తున్నాయి.
అయితే.. ఈ మ్యాచ్ అసలు జరుగుతుందా.? లేదా.? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. నిన్న స్టేడియంలో బంగ్లాదేశ్ క్రికెటర్లు పొల్యూషన్ మాస్క్లు ధరించి మరీ ప్రాక్టీస్ చేశారు. ప్రస్తుతం డిల్లీలో గాలి కాలుష్యం స్థాయి మరింత పెరిగి.. గాలి నాణ్యత పూర్తిగా క్షీణించింది. అయితే మ్యాచ్కు ఇంకా రెండు రోజుల సమయం ఉండటంతో కాలుష్య స్థాయి తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది.
ఇదిలావుంటే.. ఢిల్లీలో ప్రతికూల వాతావరణం నేపథ్యంలో తొలి టీ20 వేదికను మార్చాలని చూశారు. అయితే, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ వేదికను ఎట్టిపరిస్థితుల్లోనూ మార్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. గంగూలీ వివరణతో ఢిల్లీ టీ20 మ్యాచ్పై నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది.