టీడీపీ పొలిట్బ్యూరోకు గల్లా అరుణకుమారి రాజీనామా
By తోట వంశీ కుమార్ Published on 1 Oct 2020 4:19 PM ISTమాజీ మంత్రి, సీనియర్ నాయకురాలు గల్లా అరుణ కుమారి తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో నుంచి తప్పుకున్నారు. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు లేఖ పంపినట్లు తెలుస్తోంది. టీడీపీ కొత్త కమిటీలను నియమిస్తున్న సమయంలోనే అరుణ రాజీనామా చేయడం ఆసక్తికరంగా మారింది.
కాంగ్రెస్ పార్టీ హయాంలో మంత్రిగా పని చేసిన గల్లా అరుణకుమారి.. రాష్ట్ర విభజన తర్వాత టీడీపీలో చేరారు. తనకు బదులుగా తన కుమారుడు గల్లా జయదేవ్ను ఎన్నికల బరిలోకి దింపగా.. ఆయన రెండు మార్లు గుంటూరు నుంచి ఎంపీగా గెలిచారు. అరుణ కుమారి సీనియారిటీని గౌరవించిన చంద్రబాబు ఆమెను పార్టీ అత్యున్నత నిర్ణయాక కమిటీ అయిన పొలిట్ బ్యూరోలో చేర్చుకున్నారు. ప్రస్తుతం విపక్షానికి పరిమితమైన తెలుగుదేశం పార్టీలో సంస్థాగత మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా పార్టీకి మహిళా అధ్యక్షులను ఒకవైపు చంద్రబాబు నియమిస్తున్న తరునంలో అరుణకుమారి పొలిట్ బ్యూరోను వీడడం చర్చనీయాంశమైంది.