మాజీ సీఎం అజిత్జోగి ఆరోగ్య పరిస్థితి విషమం
By తోట వంశీ కుమార్ Published on 12 May 2020 2:51 PM GMTఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి పరిస్థితి విషమించిందని, ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్ మీద వైద్యం అందిస్తున్నామని మంగళవారం డాక్టర్లు తెలిపారు. జోగి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సునీల్ ఖేమ్కా వెల్లడించారు. ఆయన ఇంకా కోమాలోనే ఉన్నారని, ఆయన నాడీ వ్యవస్థ పనితీరు పూర్తిగా నిలిచిపోయిందని, మెదడు పనితీరును మెరుగుపరచడానికి వైద్యులు ప్రయత్నిస్తున్నారన్నారు. ఇయర్ ఫోన్స్ ద్వారా ఆయనకు ఇష్టమైన పాటలు వినిపిస్తున్నామనీ, కానీ ఇప్పటి వరకు ఏ ప్రయోజనం లేదన్నారు. గుండె పనితీరు, బీపీ అంతా సరిగానే ఉందన్నారు.
మే 9న అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఇంట్లో అజిత్ కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు, సిబ్బంది వెంటనే రాయ్పూర్లోని శ్రీనారాయణ్ ఆస్పత్రికి తరలించారు.
కాంగ్రెస్ పార్టీకి చెందిన అజిత్ జోగి వయసు 74 ఏళ్లు. 2000 నుంచి 2003 వరకూ ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రిగా పని చేశారు. అజిత్, ఆయన కుమారుడు ఉప ఎన్నికల వివాదంలో చిక్కుకుపోవడంతో ఆయన 2016లో కాంగ్రెస్ నుంచి తప్పుకున్నారు.