తొలి సీఎం ఇక లేరు
By తోట వంశీ కుమార్ Published on 29 May 2020 11:12 AM GMTగత కొన్ని రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఛత్తీస్ గడ్ తొలి ముఖ్యమంత్రి, జనతా కాంగ్రెస్ ఛత్తీస్ గడ్ పార్టీ వ్యవస్థాపకుడు అజిత్ జోగి కొద్ది సేపటి క్రితం కన్నుమూశారు. గుండెపోటు రావడంతో ఆయన రాయ్పూర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కొద్ది రోజులుగా చికిత్స పొందుతున్నారు. ఆయన ఇక లేరనే వార్తను అజిత్ జోగి కొడుకు అమిత్ జోగి ట్వటిర్లో వెల్లడించారు. ‘20 ఏళ్ల ఛత్తీస్గడ్ ఒక మూలపురుషున్ని కోల్పోయింది. నేను మాత్రమే కాదు ఛత్తీస్గడ్ మరియు ఛత్తీస్గడ్ పౌరులు కూడా తండ్రిలాంటి వ్యక్తిని కోల్పోయారు’ అని ట్వీట్ చేశారు.
2000 సంవత్సరంలో ఛత్తీస్గడ్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. ఆ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా అజిత్ జోగి పనిచేశారు. అజిత్ జోగి 2016లో కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి జనతా కాంగ్రెస్ ఛత్తీస్గడ్ పార్టీని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం జోగి వయస్సు 74 ఏళ్లు.