ఢిల్లీలో వరుస అగ్ని ప్రమాదాలు.. కారణాలు ఇవే..!

By Newsmeter.Network  Published on  24 Dec 2019 3:50 AM GMT
ఢిల్లీలో వరుస అగ్ని ప్రమాదాలు.. కారణాలు ఇవే..!

ఢిల్లీలో మంగళవారం మరో భారీ అగ్ని ప్రమాదం జరగింది. నరేలా ప్రాంతంలోని షూ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. ఫ్యాక్టరీలో సిలిండర్‌ పేలడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్రగాయాలు అయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారికి వైద్యలు చికిత్స అందిస్తున్నారు. కాగా భారీగా మంటలు ఎగిసిపడుతుండటంతో పక్కనే ఉన్న మరో రెండు ఫ్యాక్టరీలకు మంటలు అంటుకున్నాయి. దేశ రాజధానిలో వరుసగా అగ్ని ప్రమాదాలు సంభవిస్తుండడంతో ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు. విషయం తెలుసుకున్న అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. 22 ఫైరింజన్లతో మంటలను అదుపు చేస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దేశ రాజధానిలో వరుస అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. దీనిపై అక్కడి ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. అగ్ని ప్రమాదాల నివారణ చర్యలు చేపట్టాలంటున్నారు.

ఆదివారం అర్థరాత్రి కిరారి ప్రాంతంలోని ఓ బట్టల గోదాంలో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది ఆగ్నికి ఆహుతి అయ్యారు. మరో 10 మందికి తీవ్రగాయాలు కాగా వారిని వైద్యం నిమిత్తం సంజయ్ గాంధీ మెమోరియల్ ఆస్పత్రికి తరలించారు. పెద్ద మొత్తంలో ప్రాణనష్టంతో పాటు, ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు.

అంతకుముందు ముంద్క ప్రాంతంలోని ఓ గోదాంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. వెంటనే సమచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని 21 ఫైరింజన్లతో మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. డిసెంబర్ 8న అనాజ్‌ మండీలో జరిగిన అగ్ని ప్రమాదంలో 43 మంది కార్మికులు మృతి చెందారు. అనాజ్‌మండీలో జరిగిన అగ్ని ప్రమాదం ఢిల్లీలో రెండో అతి పెద్ద ప్రమాద ఘటనగా అధికారులు తెలిపారు. సంఘటన స్థలంలో మృతుల కుటుంబీకుల రోదనలతో దద్దరిల్లింది. అగ్నిమాపక సిబ్బంది 50 మందిని సురక్షితంగా కాపాడారు.

మరోవైపు హైదరాబాద్‌లోని కాటేదాన్‌ సాయిసుధ వస్త్ర దుకాణంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సుమారు రూ.ఐదు లక్షల విలువైన వస్త్రాలు అగ్నికి ఆహుతి అయ్యాయి. మంటలను ఫైర్‌ సిబ్బంది అదుపు చేశారు. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగానే అగ్ని ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.

Next Story